15 రోజుల పాటు ప్రభుత్వ యంత్రాంగం, సహాయక సిబ్బంది పడిన శ్రమ వృథా అయ్యింది.తల్లీదండ్రులు, బంధుమిత్రులు పెట్టుకున్న ఆశలపై విధి నీళ్లు చల్లింది.
న్యూజెర్సీలో సంభవించిన వరదల్లో కొట్టుకుపోయిన నిధి రానా, ఆయుష్ రానాల కథ విషాదాంతమైంది.దాదాపు పక్షం రోజుల తర్వాత వారిద్దరూ శవాలుగా కనిపించారు.
పాసైక్ నదిలో అధికారులు కనుగొన్న గుర్తు తెలియని మృతదేహాలను నిధి, ఆయుష్లుగా గుర్తించారు.
ఆయుష్ కారు సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 9.30 ప్రాంతంలో వరద నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది.దీంతో పాసైక్ అగ్నిమాపక శాఖ సిబ్బంది రోజుల తరబడి వీరిద్దరి కోసం పాసైక్ నది వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పాసైక్ ఫైర్ చీఫ్ ప్యాట్ ట్రెంటాకోస్ట్ మాట్లాడుతూ.గల్లంతైన వారి కోసం మూడు డ్రోన్లు, రెండు పడవలను రంగంలోకి దించినట్లు తెలిపారు.
అయితే నగరం కింద వున్న అండర్ గ్రౌండ్ వాటర్ వే లలోకి వీరిద్దరూ కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో .రెస్క్యూ సిబ్బంది బ్రూక్ పాసైక్ నది వైపుగా వెళ్లే కల్వర్ట్లో గాలింపు చేపట్టారు.షెరీఫ్ డిపార్ట్మెంట్, పాసైక్, క్లిఫ్టన్, హవ్తోర్న్, రింగ్వుడ్ విభాగాల నుంచి మొత్తం ఐదు పడవలతో వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో నిధి రానా మృతదేహాన్ని సెప్టెంబర్ 8న పాసైక్ నదిలోని కేర్నీలో కనుగొన్నారు.ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలోని నెవార్క్ వద్ద ఆయుష్ మృతదేహాన్ని కనుగొన్నారు.అయితే అప్పటికే మృతదేహాలు పాడైపొవడంతో వారి నమూనాలను ల్యాబ్కు పంపగా.
సెప్టెంబర్ 10 మధ్యాహ్నం వారిని నిధి, ఆయుష్లుగా ప్రాంతీయ వైద్య పరీక్షల కార్యాలయం ధ్రువీకరించింది.వీరిద్దరి మరణంతో న్యూజెర్సీలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 29కి చేరింది.
ఇక మొత్తంగా ఆరు తూర్పు రాష్ట్రాలలో 50 మంది మరణించారు.