ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్బంగా దేశం గర్వించే పని చేసే వారికి, సమాజ సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది.పద్మ అవార్డులను దక్కించుకున్న వారు వారి బాద్యతను తమకు తాము మరింతగా పెంచుకుని సమాజ సేవలో మరింత ముందుకు వెళ్తారు.
పద్మ అవార్డులు తెలుగు రాష్ట్రాల్లో కేవలం క్రీడాకారులకు, కలాకారులకు మాత్రమే వస్తాయి.కారణం మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం వారు మాత్రమే కనిపిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పద్మ అవార్డు ఒక సామాన్యుడికి వచ్చిందా చెప్పండి, రాలేదు.ఎందుకంటే సామాన్యుల్లో అసమాన్యులను ప్రభుత్వాలు గుర్తించలేక పోతున్నాయి.
కాని ఒక తెలుగు వ్యక్తి ఒరిస్సాలో సామాన్యమైన వ్యక్తిగా చాయ్ అమ్ముకుంటూ సేవ చేస్తూ ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వం అతడి పేరును పద్మ అవార్డుకు సిఫార్సు చేసింది.తెలుగు రాష్ట్రాల్లోనే ఆ వ్యక్తి ఉండి, ఛాయ్ అమ్ముకుంటూ అంతకంటే ఎక్కువ సేవ చేసినా కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయన్ను పట్టించుకునేవి కాదు.
ఒరిస్సా ప్రభుత్వంను ఈ విషయంలో అభినందించాల్సిందే.తమ వాడు కాదనే విషయాన్ని పక్కకు పెట్టి, తమ వారికి సేవ చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో అక్కడి ప్రభుత్వం పద్మ అవార్డుకు చాయ్ వాలా పేరును ప్రతిపాదించింది.
ఆంద్రప్రదేశ్కు చెందిన ప్రకాష్ రావు చాలా ఏళ్ల క్రితం ఒరిస్సాకు వలుస వెళ్లాడు.అక్కడ కటక్లో టీ స్టాల్ పెట్టుకుని బతుకును వెళ్లదీస్తున్నాడు.కటక్లో తాను ఉండే బస్తీలో స్కూల్ లేకపోవడంతో స్కూల్ను ఏర్పాటు చేయించాడు.తాను టీ అమ్మగా వచ్చిన సగానికి పైగా సంపాదనను పిల్లల చదువుకు ఉపయోగిస్తున్నాడు.అక్కడ కూలీపని చేసుకునే వారు ప్రకాష్ రావు అక్కడికి వెళ్లక ముందు చదువుకునే వారు కాదు, కాని ఎప్పుడైతే ప్రకాష్ రావు అక్కడ స్కూల్ను ఏర్పాటు చేయించాడో అప్పుడే అక్కడ చదువు ప్రారంభం అయ్యింది.
కొన్ని వందల మంది చదువుకుంటున్నారంటే అది ప్రకాష్ రావు వల్లే.అందుకే ఒరిస్సా ప్రభుత్వం ప్రకాష్ రావును స్వయంగా పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వంకు సిఫార్సు చేసింది.కేంద్ర హోం శాఖ కూడా ప్రకాష్ రావు బ్యాక్గ్రౌండ్ ఎంక్వౌరీ చేసి పద్మ అవార్డును ఇచ్చింది.
ప్రకాష్ రావు మన తెలుగు వ్యక్తి అయినందుకు గర్వించాలి, అదే సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వారికి గుర్తింపు లేకుండా పోతున్నందుకు సిగ్గుపడాలి.