ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు రష్మీ సమంత్.కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అధ్యక్ష పదవికి ఎన్నిక కాక ముందు రష్మీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవ్వడంతో రాజీనామాకు దారి తీశాయి.తన సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు జాత్యాహంకారమైనవిగా, అతి సున్నితమైనవిగా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రష్మీ సమంత్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మంగళవారం తెలిపింది.వేధింపులకు లేదా సమానత్వానికి సంబంధించి ప్రతి ఫిర్యాదును వర్సిటీ సమగ్రంగా పరిశీలిస్తుందని వెల్లడించింది.
కాగా.యూకేలోని కొన్ని హిందూ గ్రూపులు సైతం యూనివర్సిటీలోని హిస్టరీ ఫ్యాకల్టీ సిబ్బంది ఆన్లైన్లో చేసిన వ్యాఖ్యలపై థేమ్స్ వ్యాలీ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.డాక్టర్ అభిజిత్ సర్కార్ ఇన్స్టాగ్రామ్లో రష్మీ సమంత్ ఫ్యామిలీ ఫోటోతో పాటు పెట్టిన పోస్ట్లలో వారి హిందూ విశ్వాసం గురించి ప్రస్తావించాయి.అంతేకాకుండా వారి సొంత రాష్ట్రమైన కర్ణాటకను ‘‘ ఇస్లామోఫోబిక్ శక్తుల బురుజు’’గా వర్గీకరించింది.
ఈ నెల ప్రారంభంలో ఆన్లైన్లో వీటిని గుర్తించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి, భారత సంతతి పారిశ్రామిక వేత్త అల్పేష్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం వర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
అలాగే మహిళలు, లింగ మార్పిడి చేసుకున్నవారు (ట్రాన్స్ వుమెన్) ని వేరుగా చూడాలంటూ ఆక్స్ఫర్డ్ ఎల్జీబీటీక్యూ+ పేరిట రష్మీ చేసిన పోస్ట్ ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.దీనితో పాటు చైనా విద్యార్థుల పట్ల రష్మి చేసిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి .ఈ పరిణామాల నేపథ్యంలో రష్మీని రాజీనామా చేయాల్సిందిగా పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు.దీంతో తప్పని పరిస్థితిలో ఆమె రాజీనామా చేశారు.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు.తన మేనిఫెస్టోపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన విద్యార్థులందరికీ రష్మీ ధన్యవాదాలు తెలిపారు.
తన చర్యలతో, తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుని ఉంటే తనను క్షమించాలని రష్మీ ఓ ప్రకటనలో కోరారు.
కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన రష్మి సమంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు.
ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికల్లో పాల్గొని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు.
ఆమె ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అనుబంధ లినాక్రే కాలేజీలో ఎంఎస్సి ఇన్ ఎనర్జీ సిస్టమ్స్ కోర్సు అభ్యసిస్తున్నారు.స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి మొత్తం నలుగురు పోటీ చేయగా.
మిగతా ముగ్గురిని దాటుకుని రష్మి సమంత్ విజయం సాధించారు.