అమెరికాలో స్థిరపడి డాలర్లు సంపాదించి జీవితంలో సెటిలవ్వాలని చాలా మంది భారతీయుల కల.అయితే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావడంతో లక్షలాది మంది భారతీయ యువత డాలర్ కలలు కరిగిపోతున్నాయి.
ఏళ్ల పాటు ప్రయత్నించినా అమెరికా వీసా దొరక్కపోవడంతో దొడ్డిదారిన అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.2019లో 7,720 మంది భారత సంతతి ప్రజలు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాలని ప్రయత్నించి కటకటాల పాలయ్యారు.వీరిలో 272 మంది మహిళలు, 591 మంది మైనర్లు ఉన్నారు.
2019 ఆర్ధిక సంవత్సరంలో (అక్టోబర్ 2018- సెప్టెంబర్ 2019) 8,51,508 మంది విదేశీయులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.ఇది గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 115 శాతం పెరిగింది.
అంతేకాకుడా గడచిన 12 సంవత్సరాలలో ఇదే అత్యథికమని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (నాపా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నమ్ సింగ్ చాహల్ గురువారం తెలిపారు.
2019తో పాటు ఇతర ఆర్ధిక సంవత్సరాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అరెస్ట్ కాబడిన భారతీయుల వివరాలను ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద తెలుసుకున్నట్లు నాపా తెలిపింది.యూఎస్ బోర్డర్ అండ్ కస్టమ్ ప్రొటెక్షన్ గణాంకాల ప్రకారం.2017లో 4,620 మంది, 2016లో 3,544 మంది, 2015లో 3,091 మంది, 2014లో 1,663 మంది భారతీయులు అక్రమంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు.
భారతీయుల అరెస్ట్లు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని చాహల్ అభిప్రాయపడ్డారు.యూఎస్-మెక్సికో సరిహద్దుల్లో మొత్తం 48 క్రాసింగ్ పాయింట్లు, 330 పోర్టుల ద్వారా పలువురు విదేశీయలు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారుల అంతర్గత దర్యాప్తులో తేలింది.