కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.
పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.
ఇక విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ ఎవరైనా ఆత్మీయులు మరణిస్తే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వీలు లేకుండా పోయింది.కోట్లలో ఆస్తులు, పలుకుబడి వున్నప్పటికీ కూడా ఏం చేయలేక దేవుడిపైనే భారం వేసి బిక్కుబిక్కుమంటూ గడిపిన వారెందరో.
ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఎన్నో సంఘటనలు గతేడాది చోటు చేసుకున్నాయి.వాటిని ప్రపంచం ఇప్పట్లో మరిచిపోలేదు.
అదే సమయంలో అన్ని దేశాలు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయిన భారతీయులు.కేంద్ర ప్రభుత్వానికి సెల్ఫీ వీడియోలు, సోషల్ మీడియా ద్వారా తమను రక్షించాల్సిందిగా అభ్యర్ధించారు.
ఈ ఘటనలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి.పరిస్థితిని గుర్తించిన భారత ప్రభుత్వం ‘‘వందే భారత్ ఎక్స్ప్రెస్’’ పేరుతో పలు దేశాలకు ప్రత్యేక విమానాలు నడిపి లక్షలాది మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది.2020, మే 6న 64 విమానాలు, 12,800 మంది ప్రయాణికులతో ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైంది.
‘వందే భారత్ మిషన్’ కింద ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు విదేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 60 లక్షల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.అలాగే విదేశాల్లో సుమారు 3,570 మంది భారతీయులు కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
దీనితో పాటు భారతదేశంలో విధులు నిర్వర్తిస్తున్న పలుదేశాల దౌత్యవేత్తలు కూడా కరోనా బారిన పడ్డారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ రాజ్యసభకు తెలియజేశారు.కరోనా సోకిన దౌత్యవేత్తలు, సిబ్బందికి వైద్య సహాయం అందించామని మంత్రి వెల్లడించారు.
వారిని ఆసుపత్రిలో చేర్చడం, టెలిమెడిసిన్ సదుపాయం, మందులు, వ్యాక్సినేషన్ వంటివి అందించామని రాజ్ కుమార్ వివరించారు.