అంగవైకల్యం ఉన్న వారు తమకున్న లోపాన్ని గుర్తు చేసుకొని తరచు బాధపడుతారు.సమాజం లో కూడా వారికి కనీస గౌరవం లభించదు.
నలుగురు బతుకుతున్న సమాజం లో తమకంటూ స్వతహాగా ఒక గుర్తింపు తెచ్చుకోలేమని కుంగిపోతారు.కానీ లక్ష్యాన్ని ఛేదించడానికి అంగవైకల్యం అడ్డు రాదని తన ప్రతిభ నిరూపించుకుంది భారత ధీర వనిత .అంగవైకల్యం ఉన్నవారితో పాటు సామాన్యులకు కూడా ఆదర్శంగా నిలిచి ఏకంగా భారత్ కి 400 పైగా పతకాలు సాధించి మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది , ఆమెనే మాలతి కృష్ణమూర్తి హొళ్ళ.ఆమె గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిందే.
మాలతి కృష్ణమూర్తి జూలై 6వ తేదీ 1958లో కర్ణాటకలో ఉడిపి జిల్లాలోని కోట గ్రామంలో జన్మించింది.నలుగురు పిల్లలలో ఒకరైన ఈమె తండ్రి హొటల్ నడుపుతుండేవాడు.అలాంటి సమయంలో చక్కని పాప పుట్టిందని మురిసిపోతున్న వారికి జ్వరం రూపంలో కూతురు పక్షవాతానికి గురికావడం పెద్ద షాక్.పాప బ్రతుకుతుందా అనే స్థితి నుండి, బ్రతికితే ఆమె భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న పెద్ద భూతంలా కనిపించేది.
చెన్నై లోని అడయార్ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేరారు.రెండు సంవత్సరాలు రకరకాల చికిత్సలు, కరెంట్ షాక్లూ వంటి వాటి ద్వారా పైభాగానికి శక్తి వచ్చింది.
పై భాగానికి అయితే స్పర్శ వచ్చింది కాని క్రింది భాగంలో ఎలాంటి మార్పూ లేదు.
తరువాత 15 ఏళ్ళు ఆమె జీవితం హాస్పిటళ్ళు, ఆపరేషన్లు, డాక్టర్ల చుట్టూనే తిరిగింది.బాల్యంలో సహజంగా ఉండే ఆటపాటలు, సుఖసంతోషాలు ఏమి ఆమె జీవితంలో లేవు.తన 15 సంవత్సరాల్లో ఆమె 27 ఆపరేషన్లు చేయించుకుంది.
శక్తి ఉన్న భాగంతోనే ఎన్నో అవరోధాలతో ఆమె తన చదువు కొనసాగించింది.ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయ్యేంతలో, మాలతి నడుము పైభాగం బలపడింది కాలేజీలో చేరదామని వెళితే తన తరగతి మొదటి అంతస్తులో ఉండేది.
ఎవరి సాయంతోనో తప్ప సాధ్యం కాదు.ఎలా రోజూ ?… తండ్రి ప్రోత్సాహంతో కళాశాల ప్రిన్సిపాల్ ని కలసి తన తరగతి గదిని క్రింది ప్లోర్కు మార్పించగలిగింది.ఈ సంఘటన ద్వారా ఆమె తనూ ఏదైనా చేయగలన్న నూతనోత్సాహంతో ముందుకు నడిచింది.
మాలతి కృష్ణమూర్తి క్రీడకారిణిగా
1975లో బెంగుళూరులో జరిగిన వికలాంగుల క్రీడా పోటీలలో మొదటిసారి మాలతి పాల్గొన్నది.దానిలో రెండు బంగారు పతకాలు సాధించిన ఈమె వికలాంగుల క్రీడా పోటీలలో పాల్గొని 100 మీటర్లు, 200ల మీటర్ల వీల్ఛేర్ పరుగు పందాలలో తన ప్రతిభ కనబరచింది, వీల్ ఛైర్లో కూచునే బ్యాడ్మింటన్, షాట్ ఫుట్ విసరటం, డిస్క్త్రో, జావ్లిన్ విసరటం వంటివి ప్రాక్టీస్ చేసి వాటిలో అనేక బంగారు పతకాలు గెలుపొందినది.ఈమె ప్రతిభ ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది.1989లో డెన్మార్క్ లో జరిగిన అంతర్జాతీయ పోటీలలో 4 బంగారు పతకాలు గెలుచుకుంది.మాలతి ఇప్పటి వరకు వివిధ దేశాల్లో జరిగిన పోటీలలో భారత్ కి ప్రాతినిథ్యం వహించి 400 పైగా పతకాలు గెలుచుకుంది.
ఇందులో 389 బంగారు పతకాలు , 27 వెండి పతకాలు మరియు 5 కాంష్య పతకాలు ఉన్నాయి.భారత దేశం లోని క్రీడా రంగం లో వికలాంగుల విభాగం లో అత్యధిక పతకాలు గెలుచుకున్న క్రీడకారినిగా చరిత్రలోకి ఎక్కింది.
అవార్డులు రివార్డులు
1999లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం, మాలతికృష్ణమూర్తిని ‘విశ్వశ్రేష్ట మహిళ’గా గౌరవించింది.భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
క్రీడాశాఖ అర్జున అవార్డుతో సత్కరించింది.వీటితో పాటు మరెన్నో జాతీయ , రాష్ట్రీయ అవార్డ్ లు ఆమె అందుకుంది.
లక్ష్య సాధన కోసం కృషి చేస్తే అంగవైకల్యం అడ్డు రాదని , ప్రయత్నిస్తే ఫలితం తప్పక వస్తుందని మాలతి కృష్ణమూర్తి నమ్ముతారు.అందుకే అంగవైకల్యం ఉన్నపటికీ భారత దేశ క్రీడ చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఉన్నారమే.
ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం…
.