2020 సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజల జీవన విధానం, ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.లాక్ డౌన్ వల్ల థియేటర్లు మార్చి నెలలో మూతబడగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నా థియేటర్లు తెరవడానికి థియేటర్ల ఓనర్లు ఆసక్తి చూపడం లేదు.
దీంతో ఇప్పటికే సినిమా షూటింగ్ లు పూర్తి చేసుకున్న నిర్మాతలు తమ సినిమాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీల ద్వారా సినిమాలను విడుదల చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ5 ల ద్వారా తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
మొదట్లో ఓటీటీ సంస్థలు సైతం భారీ మొత్తం చెల్లించి సినిమాలను విడుదల చేయగా ఆ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ అందుకోవడంతో ఓటీటీ సంస్థలకు నష్టాలు వచ్చాయి.అయితే సినిమాలను భారీ మొత్తాలకు కొనుగోలు చేయడం వల్ల పెద్దగా లాభాలు రాకపోవడంతో ఓటీటీ సంస్థలు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి.
సాధారణంగా ఓటీటీ సంస్థలు చిన్న సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపవు.చిన్న సినిమాలను విడుదల చేసినా వాటి కోసం కొత్తగా యాడ్ అయ్యే సబ్ స్క్రైబర్లు ఉండరు.
అందువల్ల ఏవైనా చిన్న సినిమాలను ఓటీటీలో నిర్మాతలు సొంతంగా విడుదల చేసుకున్నా ప్రస్తుతం ఓటీటీ సంస్థలు వాటికి పే ఫర్ వ్యూ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తున్నాయి.ఓటీటీల కొత్త నిబంధనల వల్ల చిన్న సినిమాల నిర్మాతలకు ఏమీ మిగలడం లేదు.
మరోవైపు పెద్ద సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఓటీటీ సంస్థలు సినిమాను విడుదలకు ముందే చూస్తామని, మూడు విడతల్లో డబ్బులు చెల్లిస్తామని నిబంధనలు అమలులోకి తెస్తున్నాయి.ఈ నిబంధనల వల్ల భారీ బడ్జెట్లలో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.
థియేటర్లలో సినిమాలు విడుదల చేద్దామని అనుకుంటున్నా థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారా అనే సందేహం నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.