శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరెక్కుతున్న లవ్ స్టోరీలో పెట్టిన రమ్మంటె రాదుర చెలియ, దాని పేరే సారంగదరియ అనే పాట ఊపు ఊపుతోంది.అదే సమయంలో వివాదాలూ చుట్టుముడుతున్నాయి.
ఈ పాట విడుదల అయిన తొలిరోజు నుంచి కాంట్రవర్సీగా నిలిచింది.ఈ పాటను తానే రచించినట్లు సుద్ధాల అశోక్తేజ చెప్పుకున్నాడు.
సినిమాలోనూ ఈ పాట రచయితగా ఆయన పేరునే స్క్రీన్ మీద వేశారు.
అప్పుడే సీన్లోకి వచ్చింది జానపద గాయని కోమలి.
ఆ పాటను నేను ముందు పాడాను కాబట్టి సర్వ హక్కులూ నాకే ఉంటాయని వాదించింది.ఆ పాటను నేను పాడాలి.
మరెవ్వరితోనూ పాడించకూడదని రచ్చ చేసింది.తన పాటను సుద్దాల ఆశోక్ తేజ తన పాటగా చెప్పుకున్నాడని ఆరోపించింది.
ఇది అన్యాయం, దుర్మార్గం అంటూ గోల చేసింది.ఈ అంశాన్ని మరింత వివాదం చేయడం ఇష్టం లేని దర్శకుడు శేఖర్ కమ్ముల కోమలిని పిలిచి కొన్ని హామీలు ఇచ్చి శాంతిపజేశాడు.
అయితే ఓ జానపద గీతంపై హక్కులు ఒకవ్యక్తికి ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.పాడినంత మాత్రాన ఆ పాట వారిదైపోతుందా? జనాలు, సమాజమే హక్కుదారులుగా ఉన్న జానపదాలను తమవిగా చెప్పుకునే హక్కు ఉంటుందా? అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాటలు.ఇదే సమయంలో తానే మొదట ఈ పాటను పాడాను అని చెప్తున్న కోమలి మాటల్లోనూ వాస్తవం లేదనే విషయం బయటపడింది.ఈ పాటను ఎప్పుడో పాడటంతో పాటు పుస్తకాల్లోనూ అచ్చు అయ్యిందనే నిజం తాజాగా బయటకు వచ్చింది.
తెలంగాణ పల్లె పాటలు అనే పుస్తకంలో బిరుదరాజు రామరాజు అనే రచయిత ఈ పాటను రాశాడు.అంతేకాదు.ఈ జానపదం 1952లోనే నల్లగొండ జిల్లా నకిరేకల్లులో కొంత మంది పాడుతుంటే తాను విన్నానని ఈ పుస్తకంలో ఆయన వెళ్లడించారు.అంటే సుమారు 70 ఏండ్ల క్రితమే ఈ పాట జనం నోళ్లలో నానింది.
నిజానికి ఈ పుస్తకంలో రాసిన పాటకు, టీవీషోలో కోమలి పాడిన పాటకు, సినిమాలో సుద్దాల రాసిన పాటకు ఏమాత్రం పోలిక లేదు.అయినా ఈ పాట తమదంటే తమదని కొట్లాడు కోవడం విడ్డూరంగా ఉంది.