ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ విషయమై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం ఏపీలో వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా జరుపుకునేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వైసిపి ప్రభుత్వం ప్రకటించినా, టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఈ విషయాన్ని రాద్దాంతం చేశాయి.వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, రోడ్లపైకి వచ్చి మరి హడావుడి చేశారు.
ప్రజలలోను ఈ అంశాన్ని రెచ్చగొడుతూ, ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు.అయితే ఇవన్నీ కేంద్రం తీసుకు వచ్చిన మార్గదర్శకాలని, వాటిని తాము అమలు చేస్తున్నామని వైసిపి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, బీజేపీ తో సహా మిగతా రాజకీయ పార్టీలు ఏవి, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు.
ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందే తాము చేస్తున్నాము అని, రాజకీయ పార్టీలకు నచ్చచెప్పినా.చివరకు ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది.ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో, దీనిపై కోర్టు విచారించి, జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థిస్తూనే, మతపరమైన కార్యక్రమాలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదు అని చెబుతూనే, బహిరంగ ప్రదేశాలలో ఈ ఉత్సవాలు నిర్వహించవద్దని , ప్రైవేటు స్థలాల్లో మాత్రమే వీటిని నిర్వహించుకోవాలని , అలాగే ఐదుగురు మించి ఎక్కువమంది ఆ మండపాలలో ఉండొద్దు అంటూ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.అయితే హైకోర్టు తీర్పు వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులకు పెద్దగా ఆనందాన్ని కలిగించలేదు.
దీనికి కారణం యధావిధిగా ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతి ఇస్తుందని వారు భావించారు .కానీ దీనికి భిన్నంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, చిన్న చిన్న మార్పులు చేయడంతో వైసీపీకి పెద్దగా నష్టం లేకుండానే ఈ వ్యవహారం ముగిసింది.మతపరమైన కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కూడా అంతే అవసరమని కోర్టు భావించింది.ఈ మేరకు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కోర్టు తీర్పులో పేర్కొనడంతో విపక్షాలు సైతం దీనిపై ఎటువంటి విమర్శలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.