తెలంగాణలోని హుజురాబాద్లో అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది.ఈ మేరకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదే తేదీన ఏపీలోని బద్వేల్కు కూడా బైపోల్ జరగనుంది.అయితే, తెలంగాణలోని ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు చూపిస్తున్న జోష్.
ఏపీలో అయితే కనబడటం లేదు.అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేందుకు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉన్నాయి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరఫున హుజురాబాద్ బరిలో ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
కానీ, అధికార టీఆర్ఎస్ పార్టీపైన, ప్రభుత్వంపైన విమర్శల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
ఏపీ విషయానికొస్తే.
ఉప ఎన్నికకు మరో నెల రోజులు గడువు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల్లో జోష్ అయితే తెలంగాణలో ఉన్నంత స్థాయిలో కనిపించడం లేదు.అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
కానీ, క్షేత్రస్థాయిలో ప్రచారంలో మాత్రం దూకుడుగా కనిపించడం లేదు.బద్వేల్లో సత్తా చాటేది తామేనని, పరిషత్ ఎన్నికల్లో ఆల్రెడీ హవా చూపామని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఏపీలో కాంగ్రెస్ పార్టి కాని వామపక్ష పార్టీలు కాని జనసేన కాని బీజేపీ కాని ఇంకా స్పందించలేదు.పొత్తులో ఉన్న బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టబోతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
గతంలో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టగా ఆ అభ్యర్థిని జనసేన బలపరిచింది.
అయితే, అక్కడ వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.ఈ సారి కూడా బద్వేల్లో తామే సత్తా చాటుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే, మరి కొద్ది రోజుల్లో ప్రచార పర్వం షురూ అవుతుందని, రాజకీయ పార్టీలు జోష్ చూపిస్తాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఈ సారి కూడా బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థినే బరిలో దించాలనే ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.అయితే, ఈ ఉప ఎన్నిక గురించి జనసేనాని కాని, బీజేపీ రాష్ట్ర అధిష్టానం కాని ఇంకా స్పందించలేదు.