జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే ఉద్దేశంలో ప్రశాంత్ కిషోర్ గట్టిగానే కష్టపడుతున్నారు.రాహుల్, సోనియాలకు కీలకమైన సూచనలు చేస్తూ, పార్టీని ప్రక్షాళన చేసే ఈ విధంగా తగిన సలహాలు ఇస్తున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సలహాలతో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు సంబంధించిన చాలా వ్యవహారాల పై ప్రక్షాళన చేశారు.అనేకమంది కీలక నాయకులకు పార్టీ బాధ్యతలను అప్పగించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఆ పార్టీ అగ్రనేతల్లో కనిపిస్తుంది.అయితే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉండడం, రేవంత్ సారథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా కాంగ్రెస్ హైకమాండ్ లో కనిపిస్తోంది.
ఇక ఏపీ విషయంలోనే తీవ్ర అసంతృప్తి ఉంది.కాంగ్రెస్ ను ఏపీలో ఏదో రకంగా బలపడే విధంగా చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నా ,ఆ పరిస్థితులు రావడం లేదు.
అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సలహాతో కాంగ్రెస్ కు మునుపటి వైభవం తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.
దీనిలో భాగంగానే కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాయలసీమ ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి రోశయ్య తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ సమయంలో కీలక నిర్ణయాలు, పథకాలను అమలు చేసి కాంగ్రెస్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు.
అలాగే రాయలసీమ ప్రాంతంలో జగన్ ప్రభావం కనిపించకుండా చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు.జగన్ పై కేసులు నమోదు కావడం ,ఆయన అరెస్టు చేయడం వంటి సంఘటనలు జరిగాయి.
పార్టీ హైకమాండ్ ఆదేశాలు పూర్తిగా అమలు చేస్తూ విధేయుడిగా ఆయన ముద్ర వేయించుకున్నారు.అయితే ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడం తదితర కారణాలతో ఎన్నికలకు ముందు కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ కు దూరమయ్యారు.అయితే ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడంతో, మళ్లీ కాంగ్రెస్ హైకమాండ్ సూచన తో ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు.ప్రస్తుతం ఆయన అయితేనే కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు రాగలరని, పార్టీకి దూరమైన నాయకులను వెనక్కి తీసుకు వచ్చే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలరు అని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు సూచించడంతో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయమై కిరణ్ కుమార్ రెడ్డి కి సైతం సమాచారం అందినట్లు తెలుస్తోంది.