చాలా రోజులుగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో, కొత్త కేబినెట్ లో మార్పులు చేర్పులు అనివార్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా భావించడం, కొన్ని కొన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం కల్పించి, ఆ ప్రాంతంలో బిజెపి పట్టు చెదిరిపోకుండా చూడడం తదితర అంశాలతో క్యాబినెట్ లో మార్పు చేర్పులు మరింత వేగవంతం చేశారు.
మోదీ అమిత్ షా వంటి వారు అనేక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని మరీ కొత్త క్యాబినెట్ లో ఎవరికీ చోటు కల్పించాలని అంశాలపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.ఈరోజు గాని రేపు గాని కొత్త మంత్రివర్గ విస్తరణ పై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
అయితే కొత్త ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అనే విషయంపై విశ్వసనీయవర్గాల ద్వారా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి.
జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), శర్వానంద్ సోనోవాల్ ( అస్సాం ), లతో పాటు బీహార్ మాజీ ఉప ముఖ్య మంత్రి సుశీల్ మోడీ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అలాగే బీహార్, గుజరాత్ ఇన్చార్జిలుగా ఉన్న బిజెపి సీనియర్ నాయకుడు యోగేంద్ర యాదవ్ కు అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం.అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది పేర్లు వినిపిస్తున్నాయి.
ఆ రాష్ట్రం నుంచి వరుణ్ గాంధీ, రామ్ శంకర్ కతెరియా, అనిల్ జైన్, రిటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లాం పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి జగన్నాథ్ సర్కార్, శంతను టాకూర్, నీతిట్ ప్రమానిక్, ఉత్తరాఖండ్ నుంచి అజయ్ భట్, అనిల్ బలోనీల్లో ఒకరికి, కర్ణాటక నుంచి ప్రతాప్ సింహకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అశ్విని వైష్ణవ్ లేదా బైజయంత్ పాండా (ఒడిశా), బ్రిజేంద్ర సింగ్ ( హరియణ), రాహుల్ కస్వాన్, ( రాజస్థాన్ ) , పర్వేశ్ వర్మ లేదా మీనాక్షి లేఖి ( ఢిల్లీ ) లకు అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం.అలాగే మహారాష్ట్ర నుంచి నారాయన్ రాణే, ఉదయన్ రాజే బొస్లే లతో పాటు, పూనమ్ మహాజన్ లేదా ప్రీతం ముండెల్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.
అలాగే పసుపతి పరాస్, అప్నాధల్ నేత అనుప్రియ పటేల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.ఇక జేడీయూ నుంచి లల్లాన్ సింగ్, రామ్ నాథ్ టాఖుర్, సంతోష్ కుస్వాహాలకు దక్కబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఏపీ నుంచి వైసీపీ కి ప్రాధాన్యం ఇస్తామని, మూడు మంత్రిపదవులు కేటాయించబోతున్నారని ప్రచారం జరిగినా, ఏపీని పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది.వైసీపీ ని పక్కన పెట్టినా, టీడీపీ నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేరు మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది.
ఇప్పుడు ఆయన పేరునూ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.దీంతో ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇక లేనట్టే.