ఆన్ లైన్ గేమింగ్ కి బానిసైన యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం.ఆటకు బానిసై తిండి తినకుండా అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే.
మరికొందరు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ కు డబ్బులు అప్పులు చేసి ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు.తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ వ్యక్తి ఆన్ లైన్ గేమింగ్ కి బానిసయ్యాడు.ఆటలాడి డబ్బులు సంపాదించాలని భావించి ఏకంగా రూ.8 లక్షల వరకు అప్పు చేసుకున్నాడు.దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఆన్ లైన్ జూదానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
రెడ్ హిల్స్ ప్రాంతానికి చెందిన దినేశ్ (28) ఓ ప్రైవేట్ టెలికాం సంస్థలో ఉద్యోగి.దినేశ్ భార్య శరణ్య(22) నాలుగు నెలల గర్భవతి.లాక్ డౌన్ లో ఆన్ లైన్ జూదానికి బానిసైన దినేశ్ ఫ్రెండ్స్ వద్ద రూ.8 లక్షలు తీసుకుని ఆట ఆడేవాడు.ఈ క్రమంలో అప్పుల పాలు కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.దీంతో తల్లిదండ్రులు తమ ఆస్తిలో కొంత అమ్మి అప్పు చెల్లించారు.అయినా తీవ్ర మనస్థాపానికి గురైన దినేష్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించడంలో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.