ఆన్లైన్ అమ్మకాలు పేరిట కొంతమంది అమాయకులకు టోపీ పెడుతున్నారు.వారి తీయని మాటలతో ఏమీ తెలియని అమాయకులను బుట్టలో వేసుకొని వారిచేత ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తున్నారు.
ఎంతో ఖరీదైన వస్తువులను ఆఫర్లో చాలా చౌకగా అమ్ముతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.కస్టమర్లు కూడా ఖరీదైన వస్తువులు చాలా చౌకగా లభించడంతో ఎంతో ఆసక్తిగా అలాంటి వస్తువులను ఆర్డర్ చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఇలా ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఎన్నో సార్లు ఎంతోమంది మోసపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటన చిత్రదుర్గం లో మరొకటి చోటుచేసుకుంది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి దీపావళి పండుగ సందర్భంగా సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే కేవలం 1700 రూపాయలకే అందిస్తున్నామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.అంత తక్కువ ధరకే సాంసంగ్ గెలాక్సీ ఫోన్ వస్తుండడంతో ఎంతో మురిసిపోయి నరసింహమూర్తి ఆ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి ఆర్డర్ చేశాడు.
అయితే పోస్టల్ నుంచి ఒక పార్సిల్ వస్తుందని డబ్బులు చెల్లించి ఆ పార్సెల్ తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి నరసింహ మూర్తి కి తెలియజేశాడు.
అనుకున్నట్టుగానే పోస్టల్ శాఖ నుంచి ఒక పార్సిల్ రావడంతో నరసింహమూర్తి 1700 రూపాయలను చెల్లించి ఆ పార్సిల్ ను అందుకున్నాడు.ఎంతో ఆతృతగా తన ఫోన్ కోసం పార్సెల్ ఓపెన్ చేయగా అతనికి దిమ్మతిరిగింది.1700రూపాయల స్మార్ట్ ఫోన్ కి బదులుగా 50 రూపాయల సోన్ పాపిడి డబ్బా, ఒక రోల్డ్ గోల్డ్ చైన్ అందులో ఉండడం చూసి నరసింహమూర్తి నిర్ఘాంతపోయాడు.వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా ప్రజలు మాత్రం అప్రమత్తం కాకుండా చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ మోసపోతున్నారు.