దేశవ్యాప్తంగా ఉల్లి ధర రూ.100కి పైగానే పలుకుతుంది.వంద రూపాయల మార్క్ను ఉల్లి దిగననడంతో వినియోగదారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఉల్లిని కోయకముందే వారి కళ్లల్లో నీరు వస్తున్నాయి.ఉత్తర భారతంలో ఉల్లి కోసం ఎలాంటి రచ్చ జరుగుతుందో మనం రోజూ టీవీల్లో చూస్తున్నాం.ప్రభుత్వాలు ఉల్లిని సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు అమ్మేందుకు చర్యలు చేపట్టాయి.
అయితే ఓ చోట ఉల్లి కిలోను కేవలం రూ.10కే అమ్ముతున్నారు.ఇది తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఉల్లిని కొనేందుకు బారులు తీరారు.ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో అసలు కథేంటో చూద్దామని వెళ్లారు.మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ మార్కెట్లో ఉల్లిని రూ.10కే అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను వారు అదుపులోకి తీసుకున్నారు.అంత తక్కువకు ఉల్లిని ఎందుకు అమ్ముతున్నారని తమదైన శైలిలో విచారణ చేయగా వారు చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు పోలీసులు.
మధ్యప్రదేశ్లోని ఓ గోడౌన్లో ఇటీవల ఉల్లి చోరీ జరిగింది.
వాటిని ఎత్తుకెళ్లిన అజయ్ జాటవ్, జీతూ వాల్మికీ ఇద్దరు కలిసి తక్కువ ధరకు తిరిగి ప్రజలకు అమ్మడం ప్రారంభించారు.ఇలా చాలా ప్రాంతాల్లో దొంగలించిన ఉల్లిని తిరిగి తక్కువ రేటుకు అమ్మడం మొదలుపెట్టారు.
దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.ఏదేమైనా ఈ ఉల్లి దొంగలు కొంతలో కొంత ప్రజలకు మేలు చేశారని వారి వద్ద ఉల్లి కొన్న ప్రజలు అంటున్నారు.