ఒక్క ఓటు విలువ ఏంటో తెలుసుకోవాలంటే గుజరాత్ లో ఉన్న గీర్ అడవి లో ఉన్న మహంత్ భారత్ దాస్ దర్శన్ దాస్ ని అడగండి .ఆయన గీర్ అడవిలో ఒంటరిగా నివాసిస్తున్నాడు , అతను ప్రతి ఎన్నికలలో తన ఓటు హక్కుని వినియోగించుకుంటాడు.
ఆయన కోసం గీర్ అడవి లో ప్రత్యేక పోలింగ్ బూత్ పెడతారు.మన దేశానికి స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్ళు అవుతున్నప్పటికి ప్రపంచం లో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఇంకా అభివృద్ధి చెందలేదు.
దీనికి ఒక కారణం తక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం.ప్రతి ఓటరు తన ఒక్క ఓటుతోనే దేశం మారుతుందా అని ఓటు వేయకపోవడం దేశాన్ని ఇంకా వెనక్కి నెట్టుతుంది.మన దేశం లో కొన్ని ఎన్నికల్లో ఒక్క ఓటే గెలిచే అభ్యర్థిని నిర్ణయించింది , అవేంటో చూడండి.
1.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు – 2004
కర్ణాటకలోని సన్తేమరహళ్లి నియోజకవర్గం లో జనతా దళ్ కి చెందిన ఏ.ఆర్ కృష్ణ మూర్తి కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆర్.ధ్రువ నారాయణ పై ఒక్క ఓటు తేడా తో ఓటమి పాలయ్యారు.ఈ ఎన్నికలలో జనతా దళ్ అభ్యర్థికి 40571 ఓట్లు రాగా , కాంగ్రెస్ కి 40572 ఓట్లు వచ్చాయి.
ఒక్క ఓటు తేడా తో పదవిని కోల్పోయారు కృష్ణ మూర్తి .
ఒక్క ఓటు విలువ : పోలింగ్ జరుగుతున్న రోజు కృష్ణమూర్తి కొన్ని కారణాల వల్ల ఆయన డ్రైవర్ ని ఓటు వేయడానికి పంపలేదు.ఆ సంఘటన ఓట్ల లెక్కింపు రోజు గుర్తొచ్చి జనతాదళ్ అభ్యర్థి బాధపడి ఉంటాడు.ఈ ఒక్క సంఘటన చాలు మన ఒక్క ఓటు విలువ ఏంటో అని.
2.రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు – 2008
అప్పటి రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య కార్యదర్శి అయిన సి.పి జోషి , బి.జె.పి కి చెందిన కళ్యాణ్ సింగ్ చౌహన్ పైన ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు.జోషి కి 62215 ఓట్లు పోల్ అవగా , కళ్యాణ్ సింగ్ కి 62216 ఓట్లు వచ్చాయి.
ఒక్క ఓటు విలువ : ఆ పోలింగ్ లో సి.పి.జోషి కుటుంబం లో ఆయన తల్లి , భార్య మరియు డ్రైవర్ లు ఓటు హక్కు వినియోగించుకోలేదు.ఒకవేళ వారు ఓటు వేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.
3.మొహాలీ మున్సిపల్ ఎన్నికలు – 2015
2015 లో జరిగిన మొహాలీ మున్సిపల్ ఎన్నికలలో నిర్మల్ కౌర్ అనే మహిళ అభ్యర్థి కాంగ్రెస్ కి చెందిన కుల్ విందర్ కౌర్ రంగి చేతిలో ఒక్క ఓటు తో ఓటమి పాలయ్యారు.
4.పార్లమెంట్ లో విశ్వాస పరీక్ష – 1999
అప్పటి బి.జె.పి ప్రభుత్వంలోభాగస్వామైన, జయలలిత నాయకత్వంలోని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా బి.జె.పి ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది.1999 ఏప్రిల్ 17 లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయింది.విపక్షాలలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని కలిగి ఉండనందున మరలా లోక్ సభ రద్దయింది.పార్లమెంట్ లో ఆ ఒక్క ఓటు ప్రధానమంత్రి భవిష్యత్ ని నిర్ణయించింది.
అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజపేయి ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు.
ఒక్క ఓటు వల్ల ఏమి కాదు అనుకోకండి ,ఆ ఒక్క ఓటే మన భవిష్యత్తు ని నిర్ణయిస్తుంది , ఆ ఒక్క ఓటే నిన్ను పాలించే నాయకున్ని నిర్దారిస్తుంది.ఓటు హక్కుని వినియోగించుకోండి , మన దేశ అభివృద్ధికి పాటుపడండి…
.