నేడు ప్రేక్షకుల ముందుకు చిన్నవి పెద్దవి అన్ని కలిపి నాలుగు అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు పలాస 1978 మరియు ఓ పిట్ట కథ.
ఈ రెండు సినిమాలు కూడా మంచి పబ్లిసిటీని దక్కించుకున్నాయి.ప్రముఖులు ఈ సినిమాలకు ప్రమోషన్స్ చేయడంతో జనాల్లో సినిమాలపై ఆసక్తి అయితే కలిగింది.
కాని నేడు ఈ సినిమాలు థియేటర్లకు వస్తే మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
మొదటి రోజు సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా పబ్లిసిటీతో పబ్లిక్ వస్తారు.కాని సినిమాలకు పబ్లిసిటీ బాగానే జరిగినా కూడా జనాలు మాత్రం లేరు.ఎందుకంటే ఇది మార్చి నెల.మామూలుగానే మార్చి నెలలో సినిమాలకు జనాలు వెళ్లరు.ఎందుకంటే పరీక్షల సీజన్ కనుక.
పరీక్షలు పూర్తి అయిన తర్వాత సినిమాలకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో మార్చి మొత్తం కూడా సినిమాలు చూడకుండా ఉంటారు.
పరీక్షలు లేని వారు కరోనాకు భయపడి థియేటర్లకు వెళ్లకుండా ఉండిపోయారు.
కరోనా వైరస్ అటాక్ అవుతుందనే ఆందోళన నేపథ్యంలో నైజాం ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్లో థియేటర్లు మొత్తం వెల వెల పోతున్నాయి.ఈ సమయంలో విడుదలైన ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటీ అంటూ జనాలు పాపం అంటున్నారు.
ఈ రెండు సినిమాలు కూడా తీవ్ర నష్టాలను చవిచూడాల్సిందే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.