పెళ్లి అంటే నూరేళ్ల బంధం అని అంటారు పెద్దలు.అంతేకాక ఇద్దరు వ్యక్తులు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుంటూ కట్టె కాలేంతవరకు జీవించడంతో పెళ్లి బంధం సార్థకమవుతుందని కొందరి నమ్మకం.
అయితే మామూలుగా కొన్ని పెళ్లిళ్లు పెళ్లి పీటల వరకు వచ్చి తమ వ్యక్తిగత కారణాల వల్ల ఆగిపోతున్నాయి, మరికొన్ని పెళ్లిళ్లు జాతకాలు కలవక లేదా కట్నకానుకల విషయాలలో తేడాలు రావడంతో ఆగిపోవడం మనం గమనిస్తుంటాం.కానీ ఈ అన్ని అడ్డంకులను ఎదుర్కొని వచ్చినప్పటికీ ప్రకృతి సహకరించక పెళ్లి ఇప్పటి వరకు మూడు సార్లు వాయిదా పడిన సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి ప్రేమ చంద్రన్ మరియు సంద్ర సంతోష్ అనే యువతి యువకుల కుటుంబ సభ్యులు వీళ్ళ ఇద్దరికీ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు.ఇందులో భాగంగా 2018వ సంవత్సరంలో మే నెలలో వీరి వివాహం ఘనంగా జరిపించాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
దీంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా నిఫా వైరస్ కలకలం సృష్టించడంతో అనుకోకుండా కొంతకాలం పాటు ఈ పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది.అయినప్పటికీ కుటుంబ సభ్యులు నిరాశ చెందకుండా గత సంవత్సరం ఓనం పండుగ హాలిడేస్ లో పెళ్లి జరిపించాలని మళ్లీ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అయితే ఆ సమయంలో తుఫాన్ కారణంగా మరో మరోమారు వాయిదా పడింది.దీంతో కొందరు పెద్దలు అసలు వీరిద్దరి పెళ్ళికి ప్రకృతి సహకరించడం లేదంటూ ఈ పెళ్లిని ఇక క్యాన్సిల్ చేసుకోవాలంటూ పలువురు కుటుంబ సభ్యులు బంధువులు యువతీ యువకుల తల్లిదండ్రులకు సూచించారు.అయినప్పటికీ వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం బాగుండడంతో ఇతరులు చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఈసారి మళ్లీ మార్చి 22వ తారీఖున పెళ్లి రోజు ముహూర్తం ఫిక్స్ చేశారు.
అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో లాక్ డౌన్ ని విధించిన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో మరో మారు ప్రేమ చంద్రన్, సంద్ర సంతోష్ పెళ్లి వాయిదా పడింది.అయితే మరి ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
.