మోసపోయే వాళ్ళు ఉండాలి కానీ మోసం చేసేవారికి కొదవలేదు.జనాలను అమాయకులను చేసి ఎన్నిరకాలుగా మోసం చేయాలో అన్నిరకాలుగా మోసం చేయడంలో ఆరితేరిపోయారు మోసగాళ్లు.
ఇక అవినీతి నిర్ములన పేరుతో కొత్తగా తీసుకొచ్చిన నోట్లతో అప్పుడే మోసాలు చేయడం మొదలుపెట్టేశారు.ఏకంగా ఓ బ్యాంక్ పేరుతో ముద్రించిన నోట్లను ఇచ్చి ఓ బంగారం షాపు యజమానిని బురిడీ కొట్టించారు ఓ జంట.
శ్యామ్ సుందర్ వర్మ అనే వ్యక్తికి లుధియానాలో జ్యూవెలరి షాప్ ఉంది.ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ జంట బంగారం కొనాలని శ్యామ్ సుందర్ షాప్కి వచ్చింది.దాదాపు 56 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశారు.దీని విలువ దాదాపు 1.90 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిసింది.బంగారం కొన్న అనంతరం సదరు జంట మాకు చాలా అర్జెంట్ పని ఉందంటూ ఓ నోట్ల కట్టను ఇచ్చేసే అక్కడి నుంచి హాడవుడిగా బయటపడ్డారు.
అనంతరం శ్యామ్ సుందర్ వారు ఇచ్చిన నోట్లను పరిశీలించగా అవి నకిలీ నోట్లుగా తేలింది.సదరు జంట 500 రూపాయల నోట్ల కట్టను ఇచ్చారు.అవి చూడ్డానికి ఒరిజినల్ 500 రూపాయల నోట్ల రంగులోనే ఉన్నాయి.కానీ రిజర్వ్ బ్యాంక్ అని ఉండాల్సిన చోట మాత్రం ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ అని ఉందని బాధితుడు తెలిపాడు.
వచ్చిన వాళ్లు తనకు నకిలీ నోట్లు ఇచ్చారని అర్థం చేసుకున్న శ్యామ్ సుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.