ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఎక్కడ లేని గందరగోళం నెలకొని ఉంది.రాజధాని విషయంలో వైసిపి ఏ విధంగా ముందుకు వెళుతుంది అనే విషయంలో ఎవరికి ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది.
కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.అదే సమయంలో రాజధాని మార్చమని అప్పట్లో పురపాలక మంత్రి బోష్ఛ సత్యనారాయణ ప్రకటించారు .ఆ తరువాత రాజధాని ముంపు ప్రాంతం లో ఉందని, అటువంటి ప్రదేశంలో నిర్మాణాలు చేయడం భవిష్యత్తులోనూ ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయని ప్రకటించారు.తెలుగుదేశం ప్రభుత్వం తమ స్వార్ధ ప్రయోజనాలు కోసం మాత్రమే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసిందని అప్పట్లో బొత్స విమర్శలు చేశారు.
దీనిపై ఎక్కడ లేని గందరగోళం ఏర్పడింది.ప్రస్తుతం రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణం పనులను నవంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు కూడా వినిపించాయి.కానీ మరోమారు ఇదే గందరగోళం కొనసాగిస్తూ బొత్స సత్యనారాయణ మరో ప్రకటన విడుదల చేశారు.అదేంటంటే రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి, రాజధాని ఎలా ఉండాలి ,? ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది తదితర విషయాలపై నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ ఆయన ప్రకటించారు.ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతంలో వర్షం పడితే ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు.ఇక్కడ భవనాలు నిర్మించాలన్నా 100 అడుగుల లోతు పునాదులు తవ్వాల్సి ఉంటుందని, దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాజధాని నిర్మాణంపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడంతో పాటు ప్రజాభిప్రాయాన్నిసేకరించి రాజధాని ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు.హైకోర్టును రాయలసీమలో పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని, మరికొందరు ఉత్తరాంధ్రలో పెట్టాలంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రజా డిమాండ్లను కమిటీ పరిశీలించి నివేదిక ఇస్తుందని తెలిపారు.అభివృద్దిని వికేంద్రీకరించడం, రాష్ట్ర సమగ్రాభివృద్దే లక్ష్యంగా కమిటీ నివేదిక ఉంటుందని బొత్స చెప్పుకొచ్చారు.మొత్తంగా బొత్స చెబుతున్న మాటలను బట్టి చూస్తే రాజధాని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలివెళ్లడం తప్పదు అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.