అగ్ర రాజ్యం అమెరికా ఇప్పుడిప్పుడే కరోనా నుంచీ బయటపడుతోంది, కేసుల సంఖ్య తగ్గడంతో పాటు, ఆర్ధిక వ్యవస్థ కూడా గాడిలో పడుతోంది, ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది ఏదో ఒక ఉద్యోగంలో చేరి జీవనం సాగిస్తున్నారు.అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇచ్చిన ఎంట్రీ అందరిని షాక్ కి గురిచేసింది.
ముఖ్యంగా గత వేరియంట్ ల ధాటికి తీవ్రంగా నష్టపోయిన అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ ప్రజలను ఒమిక్రాన్ ఆందోళనలోకి నెట్టేసింది.
న్యూయార్క్ ప్రజలకు ప్రస్తుతం ఒమిక్రాన్ భయం పట్టుకుంది.
సెకండ్ వేవ్ సమయంలో న్యూయార్క్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.శవాలు గుట్టలుగా పోసి ఖననం చేశారు.
ఆసుపత్రుల ముందు కోవిడ్ రోగులు బారులు తీరారు.ఈ పరిస్థితి మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుందనే భయం నగరంలో ప్రతీ ఒక్కరిలో నెలకొంది.
పైగా డెల్టా వేరియన్ కంటే 10 రెట్లు ప్రమాదకరమైన వైరస్ అని నిపుణులు హెచ్చరించడంతో న్యూయార్క్ వాసులు మరింత ఆందోళన చెందుతున్నారు.కాగా
న్యూయార్క్ నగరంలో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ కేసులు 8 వరకు బయటపడ్డాయని అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది.మరో మారు న్యూయార్క్ లో ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నగర హెల్త్ కమీషనర్ మేరీ ఓ ప్రకటనలో తెలిపారు.ప్రతీ ఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరారు.
ఇదిలాఉంటే వాషింగ్టన్ , మసాచుసెట్స్ రాష్ట్రాలలో సైతం ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలుస్తోంది.గత వేరియంట్ ల కారణంగా కేవలం ఒక్క న్యూయార్క్ నగరంలో సుమారు 40 లక్షల పాజిటివ్ కేసులు ఇప్పటి వరకూ నమోదు కాగా, దాదాపు 91 వేల మంది మృతి చెందారు.