కరోనా మహమ్మారి దేశాలను అతలాకుతలం చేయడం తో పాటు బంధాలు,బంధుత్వాలను మంటగలుపుతుంది.అమ్మ,నాన్న,అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎలాంటి రక్తసంబంధాన్ని కూడా దగ్గరకు రాకుండా మనుషులను కట్టడి చేసేస్తుంది.
కరోనా గురించి జాగ్రత్తగా ఉండండి, కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష చూపించవద్దని పదే పదే ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నప్పటికీ ఈ మహమ్మారికి భయపడి చాలా మంది కరోనా వచ్చిన వారిపై వివక్ష చూపుతున్నారు.
ఇలాంటి ఘటనే కరీంనగర్ లో చోటుచేసుకుంది.కరోనా వచ్చింది అన్న అనుమానం తో కన్న తల్లినే ఇంటి నుంచి బయటకు గెంటేశారు కొడుకులు.
కరీంనగర్లోని కిసాన్నగర్కు చెందిన శ్యామల అనే వృద్ధురాలు కొద్ది నెలల క్రితం మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లింది.అయితే లాక్డౌన్ కారణంగా రెండు నెలల పాటు అక్కడే చిక్కుకుపోయింది.లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎలాగోలా కరీంనగర్ చేరుకున్న ఆమెకు కరోనా ఉందేమో అన్న అనుమానంతో ఆమె కొడుకులు ఇంట్లోకి రానివ్వలేదు.దీంతో మండుటెండలో ఎక్కడికి వెళ్లాలో తెలియక… కొడుకుల ఇంటి ముందే కూర్చుండిపోయింది వృద్ధురాలు.
మరోవైపు వృద్ధురాలి పట్ల ఆమె కొడుకుల వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.