ఇరాన్ చమురు ట్యాంకర్ ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది.ఈ నేపథ్యంలో బ్రిటన్ తీరు కు ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
బ్రిటన్ ఒక సముద్రపు బందిపోటుగా వ్యవహరించింది అంటూ ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హతామీ విమర్శించారు.గత గురువారం ఇరాన్కు చెందిన సూపర్ టాంకర్ గ్రేస్-1ను బ్రిటిష్ మెరైన్స్, జిబ్రాల్టర్ పోలీసులు ఐబీరియన్ ద్వీపకల్పం దక్షిణ తీరం వద్ద స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ప్రభుత్వ టీవీలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమను బెదిరించేందుకు రాయల్ మెరైన్స్ (బ్రిటన్ నౌకాదళం) చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తమ దేశానికి చెందిన చమురు వాహక నౌకను బ్రిటన్ నిర్బంధించటం సముద్ర చౌర్యమేనని, ఇటువంటి ప్రవర్తనను ఇరాన్ ఏ మాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
మరోపక్క తమ చర్యలను జిబ్రాల్టర్ ప్రధాని సమర్ధించుకుంటున్నారు.సిరియాపై ఐరోపా కూటమి విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ ఆ దేశానికి చమురు సరఫరా చేస్తుంది అని ఈ నేపథ్యంలో తాము బ్రిటన్ నౌకాదళం సాయం తో ఆ నౌకను స్వాధీనం చేసుకున్నట్లు జిబ్రాల్టర్ ప్రధాని ఫాబియన్ పికార్డో ప్రకటించారు.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ కొట్టిపారేస్తుంది.
అసలు ఆ నౌక సిరియా కు వెళ్లడం లేదని అసలు మా చమురు నౌకను స్వాధీనం చేసుకొనే హక్కు బ్రిటన్ కు లేదంటూ ఇరాన్ స్పష్టం చేసింది.