అమెరికాలో భారత సంతతికి చెందిన ఒహియో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంటానీ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.డల్లాస్ నగరంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ మెమోరియల్ను మంగళవారం నీరజ్ అంటానీ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ను డల్లాస్ నగరంలో నిర్మించడంలో ప్రవాస భారతీయుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ చేసిన అవిరళ కృషి ఎంతో స్పూర్తిదాయకమని అన్నారు.
కేవలం ప్రవాస భారతీయులనే కాకుండా.స్థానిక అమెరికన్లను ప్రసాద్ ఈ కార్యక్రమంలో భాగం చేశారని నీరజ్ ప్రశంసించారు.
ప్రపంచం మొత్తానికి గాంధీ మహాత్ముడు ఆదర్శమైన నాయకుడని, అయన చూపిన శాంతి బాట, సర్వమానవ శ్రేయస్సు ఎల్లవేళలా ఆచరణీయమని కొనియాడారు.దీని సాకారానికి సహకరించిన వారందరికీ నీరజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ .భారత సంతతికి చెందిన రెండో తరం అమెరికా రాజకీయాలలో దూసుకెళ్తోందని ప్రశంసించారు.ఇందుకు ప్రతీక నీరజ్ అంటానీ అన్నారు.23 ఏళ్ల వయసులోనే ఒహియో రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి, రిపబ్లిక్ పార్టీ తరఫున మూడు సార్లు రాష్ట్ర ప్రతినిధిగా ఎన్నికయ్యారని ప్రసాద్ కొనియాడారు.ఆరేళ్ల పాటు ఆ పదవిలో పనిచేసి, ఇటీవలే ఒహియో సెనేట్కు ఎన్నికై చరిత్ర సృష్టించారని ఆయన ప్రశంసించారు.అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న ప్రవాస భారతీయులలో నీరజ్ అతి పిన్నవయస్కుడు కావడం గర్వించదగ్గ విషయమని డాక్టర్ తోటకూర ప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఇక ఒహియో రాష్ట్ర సెనేటర్గా నీరజ్ ఈ పదవిలో 2024 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు.
కాగా, డల్లాస్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని 2014లో ఏర్పాటు చేశారు.
విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివ వరప్రసాద్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు.ఈ విగ్రహ ఏర్పాటుకు తోటకూర ప్రసాద్ ఎంతో శ్రమించారు.
తన ఆలోచనను అమెరికాలోని ప్రవాస భారతీయులతో పాటు స్థానిక అమెరికన్లకు వివరించారు.వారి సహకారంతో ప్రసాద్ ఈ మెమొరియల్ను పూర్తి చేశారు.మహాత్మాగాంధీ మెమొరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్కు ఆయన 2013 నుంచి ఛైర్మన్గా కొనసాగుతున్నారు.2011 నుంచి 2013 వరకు తానా అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రసాద్.గుర్తింపు లేని అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన భారతీయ విద్యార్ధులకు అండగా నిలిచారు.కృష్ణాజిల్లా గన్నవరంలో జన్మించిన ప్రసాద్.డల్లాస్లోని ‘‘ఏక్ నజర్ డాట్ కామ్’’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.గతంలో మొబిల్ ఆయిల్ కార్పోరేషన్లో మార్కెటింగ్ మేనేజర్గానూ పనిచేశారు.