బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక సంస్కరణలు చేపడుతూ వస్తున్నారు.దశాబ్ధాల యూకే వాసుల కల అయిన బ్రెగ్జిట్ను ఆయన సాకారం చేశారు.
ఆ తర్వాత దేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోనూ కీలక మార్పులు చేపట్టారు.అలాగే కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారీగా ఉద్దీపన ప్యాకేజ్లను జాన్సన్ ప్రకటించారు.
అటు భారతదేశానికి ఆయన అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.యుద్ధవిమానాలు, కీలకమైన రక్షణ వ్యవస్థలను ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయడంపై జాన్సన్, ప్రధాని మోడీలు ఈ విషయంపై పరస్పరం అంగీకారం తెలిపారు.
భారత్ ఉత్పత్తి చేస్తున్న తేజస్ ఎంకే 2 విమానానికి సంబంధించి సహకారం అందించే అంశంపై అంగీకారానికి వచ్చారు.దీంతోపాటు బ్రిటన్, భారత్లోని కీలక పరిశ్రమలు, ప్రయోగశాలలు, విద్యాసంస్థల మధ్య బంధాన్ని మరింత పటిష్ట పర్చేందుకు ఇద్దరు ప్రధానుల మధ్య కీలక చర్చలు జరిగాయి.
ఇకపోతే తాజాగా ప్రభుత్వాన్ని సుస్ధిరంగా వుంచుకునేందుకు కూడా జాన్సన్ వ్యూహాలు రచిస్తున్నారు.ఇపై సర్కార్ను ఇరుకునపెట్టేవారికి చెక్ పెట్టాలని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.దీనిలో భాగంగా బ్రిటన్లో అధికారిక రహస్యాల చట్టాన్ని సవరించేందుకు జాన్సన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ చట్టంలో మార్పుల ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కథనాలు రాసే జర్నలిస్టులకు ఇకపై 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడనుంది.
అంతేకాదు వారిని విదేశీ గూఢచారులుగా పరిగణిస్తారు.
ఇంటర్నెట్ ప్రభావాన్ని ముఖ్యంగా వేగంగా డాటాని బదిలీ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని 1989 లో చేసిన ఈ చట్టంలో అవసరమైన మార్పులు చేపట్టాలని ప్రధాని సిద్ధమయ్యారు.
మానవ హక్కుల సంస్థ, లా కమిషన్ ఇప్పటికే దాని బ్లూప్రింట్ను సిద్ధం చేశాయి.
అయితే జర్నలిస్టులకు తమను తాము రక్షించుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.ఈ చట్టంలో ఇప్పటికే మార్పులు జరిగి ఉంటే, ఆరోగ్య కార్యదర్శి మాట్ హన్నాక్ కొవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్లు వెల్లడించిన జర్నలిస్టుపై విచారణ జరిగే అవకాశం ఉండేదని విమర్శకులు చెబుతున్నారు.ప్రస్తుత చట్టం లీకర్స్ లేదా విజిల్బ్లోయర్స్, విదేశీ గూఢచారుల మధ్య నిబంధనలు, శిక్షలను వేరు చేస్తుందని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్యూజే) ప్రతినిధి అన్నారు.తప్పు చేసే జర్నలిస్టులకు కఠిన శిక్ష వేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఎన్యూజే నేత ఒకరు చెప్పారు.1989లో ఈ చట్టాలు చేసిన సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా పరిమితంగా ఉండేదని బ్రిటన్ ప్రభుత్వం వాదిస్తోంది.