వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలు ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు రాకపోవడంపై కొంతమంది మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు నిరాకరించడంతో వారి తీరుకు నిరసనగా బ్యాంకుల ఎదుట పెద్ద ఎత్తున చెత్త వేయించడం సంచలనం సృష్టించింది.
కృష్ణా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలోనూ ఇదే విధంగా ఒకే రోజు చేయడం పై కేంద్రం సీరియస్ గా స్పందించింది.ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఇది ఏ మాత్రం మంచి పరిణామం కాదని, దీనికి సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడడంతో పాటు, కేంద్రం ఆగ్రహానికి గురికాకుండా నష్టనివారణ చర్యలకు దిగింది.
ఈ వ్యవహారంలో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేస్తూ, ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను సైతం ఇవ్వాలని ఆదేశించింది.
అంతే కాదు ఉయ్యూరు కమిషనర్ ప్రకాష్ రావు ను సస్పెండ్ చేయకముందే , ఆయనతో క్షమాపణలు చెప్పిస్తూ, బ్యాంకర్ల ను వేడుకున్నట్లుగా వివరణను సైతం ఇప్పించారు.అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ సైతం బ్యాంకర్లతో చర్చించి ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుతూ లేఖ సైతం రాశారు.
అయితే కేవలం ఉయ్యూరు, విజయవాడ, మచిలీపట్నం మాత్రమే కాకుండా కృష్ణా జిల్లా అంతటా ఒకే సమయంలో ఈ విధంగా బ్యాంకుల ముందు ‘ చెత్త ‘ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో, ఇందులో అధికారుల పాత్ర నామమాత్రమేనని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ కీలక నాయకుడు, ఓ మున్సిపల్ ఉన్నతాధికారి నిర్ణయం మేరకే మున్సిపల్ కమిషనర్ ఈ వ్యవహారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.అయితే కొంతమంది ఉద్యోగులను సస్పెండ్ చేసి ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టినట్లు గా కనిపిస్తున్నా, రాజకీయంగానూ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బ్యాంకర్ల తీరుకి నిరసనగా ఈ ‘ చెత్త ‘ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన తీరుపై కేంద్రం సీరియస్ అవడంతో.
ఆ ప్లాన్ బెడిసికొట్టి అటు అధికారులు సస్పెండ్ కావడంతో పాటు, ఏపీ ప్రభుత్వం అప్రదిష్టపాలు కావాల్సి వచ్చింది.