ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికలు విజయవంతంగా ముగియడం తో పాటు ఫలితాల ప్రకటన కూడా వెలువడింది.టిఆర్ఎస్ 55 ,బీజేపీ 48, కాంగ్రెస్ 2, ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకున్నాయి.
ఇంకా ఒక డివిజన్ ఫలితం వెలువడాల్సి ఉంది.ఇది ఇలా ఉంటే.
నువ్వా నేనా అన్నట్లు గా బీజేపీ టిఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో టిఆర్ఎస్ కాస్త ఆదిత్య కనబరిచింది తప్ప, ముందుగా ఊహించినట్లుగా 100కు పైగా స్థానాలను దక్కించుకుంటాము అని గొప్పగా చెప్పుకున్నా, ఆ గొప్పలు అన్నీ వట్టివి అయిపోయాయి. గ్రేటర్ పీఠం కోసం బీజేపీ సైతం గట్టిగానే కష్టపడటం, అంతేకాకుండా టిఆర్ఎస్ దగ్గరగానే ఫలితాలు రాబట్టుకోవడం చూస్తుంటే ఆ పార్టీ తెలంగాణలో బలం పుంజుకున్నట్టుగానే కనిపిస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన ఉత్సాహంతో మరింత హుషారుగా బీజేపీ శ్రేణులు గ్రేటర్ ఎన్నికలలో పాల్గొన్నాయి.గ్రేటర్ పీఠాన్ని సంపాదించడం… టిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ శ్రేణులు అంతా కలిసికట్టుగా పని చేశాయి.అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో బీజేపీ డివిజన్లను దక్కించు కోకపోయినా, నైతికంగా మాత్రం బీజేపీ విజయం సాధించినట్లే.2016 లో బీజేపీ నాలుగు స్థానాలను మాత్రమే దక్కించుకుంది.కానీ ఇప్పుడు గట్టిగానే ప్రభావం చూపించింది.గెలుపొందిన సీట్లు లెక్కన చూసుకుంటే, టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నా , ఓట్ల లెక్కల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది.
బీజేపీ అత్యధికంగా 12,13,900 ఓట్లు పోల్ అయ్యాయి.
ఇది మొత్తం 31.43 శాతం.టిఆర్ఎస్ పార్టీకి 11,89,250 ఓట్లు పోలయ్యాయి ఇది 30.79 శాతం.2016 లో బీజేపీ కి వచ్చిన ఓట్లు 3,46, 253.ఈసారి 8 లక్షల ఓట్లు ఎక్కువగా సాధించింది.గత ఎన్నికలతో పోలిస్తే 2.79 లక్షల ఓట్లను టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది.ఈ విధంగా చూసుకుంటే గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఓటమి చెందినా, నైతికంగా బీజేపీ విజయం సాధించినట్లుగానే కనిపిస్తోంది.
ఇదే విషయాన్ని బీజేపీ సైతం గట్టిగానే ప్రచారం చేస్తోంది.