ఓసీఐ కార్డుదారులు భారత్కు వచ్చేందుకే విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పలు దేశాల్లోని భారత సంతతి ప్రజలు స్వాగతించారు.
ఇది తమకు పెద్ద ఉపశమనంగా వారు అభివర్ణించారు.ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా ఓసీఐ కార్డు ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వ్యక్తులకు జారీ చేయబడుతుంది.
దీని వల్ల వారికి మనదేశంలో ఓటు హక్కు, ప్రభుత్వ సేవలు, వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం మినహా ఒక భారతీయుడికి వర్తించే అన్ని హక్కులు లభిస్తాయి.అదే సమయంలో ఈ కార్డు వారికి ఎప్పుడైనా భారత్కు వచ్చేందుకు వీసా రహిత ప్రయాణాన్ని అందజేస్తుంది.
అయితే కరోనా నేపథ్యంలో విదేశీయుల వీసాలతో పాటు అవసరం లేకుండా భారతదేశానికి వచ్చే వెసులుబాటు వున్న ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డులపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది.అమెరికాలో హెచ్1 బీ, గ్రీన్కార్డుల దారుల పిల్లలు అక్కడే పుట్టడంతో వారంతా ఓసీఐ పరిధిలోకి వస్తారు.
ఇది వారికి శరాఘాతంలా తగిలింది.
ఎందుకంటే కరోనా వల్ల తలెల్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఎన్నో దేశాల్లో భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు.ఇలాంటి వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు ప్రక్రియను చేపట్టింది.అయితే కేంద్రం విధించిన నిషేధం కారణంగా ఓసీఐ కార్డుదారులను ఆ విమానాల్లోకి అనుమతించలేదు.
వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రవాసీ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం గత శుక్రవారం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.
దీని ప్రకారం విదేశాల్లో ఉన్న భారతీయులకు జన్మించి, ఓసీఐ కార్డ్ కలిగిన వారిని భారత్కు వచ్చేందుకు అనుమతిస్తారు.అంతేకాకుండా కుటుంబసభ్యుల్లో ఎవరైనా మరణించడం వంటి అత్యవసర పరిస్ధితులు నెలకొన్నప్పుడు స్వదేశానికి రావాలనుకునే ఓసీఐ కార్డుదారులు ప్రయాణించొచ్చని కేంద్రం అనుమతించింది.
భారతదేశంలో శాశ్వత నివాసం కలిగి వున్న భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి ఓసీఐ కార్డు ఉంటే వారికి భారత్కు వచ్చే అవకాశం కల్పిస్తారు.ఇక విదేశాల్లో చదువుకుంటున్న ఓసీఐ కార్డు కలిగిన విద్యార్ధులు స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఉంది.
అయితే వారి తల్లిదండ్రులు భారత పౌరులై, ఇక్కడ నివసిస్తున్న వారై ఉండాలి.