ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.దేశాధ్యక్షుడి నుంచి తోటి అమెరికన్ల వరకు హిత బోధ చేస్తున్నా అగ్రరాజ్యంలోని కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆసియా అమెరికన్లపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.వీరిని టార్గెట్ చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతోంది.
భౌతికదాడులతో పాటు హత్యలకు సైతం ఉన్మాదులు వెనుకాడటం లేదు.గతేడాది మార్చి నెలలో అట్లాంటాలోని మూడు మసాజ్ పార్లర్లను లక్ష్యంగా చేసుకుని ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మహిళలు మరణించిన ఘటన కలకలం రేపింది.
అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు సహా పలువురు ప్రముఖులు ఆసియన్లపై ద్వేషాన్ని విడనాడాలని పిలుపునిచ్చినా కొందరు మారడం లేదు.
తాజాగా శనివారం ఉదయం ఆసియా సంతతికి చెందిన మహిళను సబ్ వే రైలుకు కిందకు తోసి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని 61 ఏళ్ల సైమన్ మార్షల్గా గుర్తించారు.ఈ ఘటన జరిగిన గంటలోపే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనను సార్జంట్ అన్వర్ ఇష్మాయిల్ యాదృచ్ఛిక దాడిగా అభివర్ణించారు.టైమ్స్ స్క్వేర్ 42వ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో 40 ఏళ్ల మిచెల్ అలిస్సా గోను రైలు వస్తుండగా పట్టాల మీదకి నెట్టడంతో మరణించిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు.శనివారం ఉదయం 9.40 గంటలకు ఈ సంఘటన జరిగిందని న్యూయార్క్ పోలీస్ కమీషనర్ కీచంట్ సెవెల్ మీడియాకు వివరించారు.నిందితుడికి నేర చరిత్ర వున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నెల ప్రారంభంలో ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, గవర్నర్ హోచుల్లు సబ్వేలు, స్టేషన్లను తనిఖీ చేయడానికి మరింత మంది అధికారులను కేటాయిస్తామన్నారు.నేరాలను తగ్గించడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడంపై పోలీస్ కమీషనర్ సెవెల్తో కలిసి పనిచేస్తామని మేయర్ ఆడమ్స్ శనివారం మీడియాకు తెలిపారు.దేశవ్యాప్తంగా ఆసియా అమెరికన్లపై దాడులు ఇటీవలి కాలంలో పెరిగాయి.కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.గతేడాది ఏప్రిల్లో ఈస్ట్ హార్లెమ్లో జరిగిన ఓ ఘటనలో 62 ఏళ్ల ఆసియా వ్యక్తిపై కొందరు దాడి చేశారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.