ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే పోయేది నారా లోకేష్ మాత్రమే అన్న విషయం అందరికీ బాగా తెలుసు.లోకేష్ ను రాజకీయంగా బలమైన నాయకుడిగా తయారుచేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.
ఇప్పటికే ఆయనకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా అవకాశం కూడా కల్పించారు.త్వరలోనే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పజెప్పి పూర్తిస్థాయిలో పార్టీపై పట్టు పెరిగేలా చేయాలని చూస్తున్నారు.
దీనికోసం లోకేష్ కంటూ ప్రత్యేకంగా ఒక టీమ్ ను తయారు చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు.తాను రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నా, లేకపోయినా లోకేష్ కు తిరుగు లేకుండా ఉండేవిధంగా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే పార్టీ శ్రేణుల్లో మాత్రం లోకేష్ నాయకత్వం, సమర్థతపై ఏమాత్రం నమ్మకం లేదు.ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ వినాశనానికి దారి తీస్తుందని మెజారిటీ నాయకుల అభిప్రాయం.టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులకు ఇదే రకమైన అభిప్రాయం ఉంది.ఈ దశలో తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడి వల్లే సాధ్యమనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ఆ స్థాయిలో పైకి తీసుకు వెళ్ళగల నాయకత్వ లక్షణాలు, చరిష్మా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉన్నాయని అంతా నమ్ముతున్నారు.
చంద్రబాబు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టినా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో యాక్టివ్ కావాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం అంటే మమకారం పోలేదని, ఎన్ని అవమానాలు చేసినా, ఆయన తన తాత స్థాపించిన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేందుకు సిద్ధంగా ఉంటారాని, గతంలోని తన కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీ తోనే ఉంటానంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించిన విషయాన్ని కూడా ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.
లోకేష్ కోసం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని పణంగా పెట్టవద్దనే సూచనలు ఇప్పుడు ఆ పార్టీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నా, పార్టీలో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా ముందుకు వస్తారని, కాబట్టి ఆయన పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యేవిధంగా చంద్రబాబు చొరవ తీసుకోవాలనే డిమాండ్ లు ఇప్పుడు పార్టీలో ఎక్కువయ్యాయి.