నిత్యం వివాదాల్లో తలదూరుస్తూ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తెరపైకి వచ్చాడు.అతని దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కబోతోంది.
ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.నాస్తికుడిగా పేరు పొందిన వర్మ శ్రీవారిని దర్శించుకోవడం ఒక సంచలనం అవుతుండగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా తిరుపతిలోని శిల్పారామం వద్ద వైసీపీ పోస్టర్లు వెలిశాయి.
సినిమా ముహూర్తం షాట్కు ఆహ్వానిస్తూ వైసీపీ ప్రముఖ నేతల ఫొటోలతో పోస్టర్లు ఏర్పాట్లు చేశారు.ఈ పోస్టర్లలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రోజాతో సహా ఇతర నేతలను చిత్రించారు.రాంగోపాల్ వర్మ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆయనతో పాటు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రబృందం శ్రీవారిని దర్శించుకున్నారు.అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా ఇప్పుడు తిరుపతి నగరంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.