కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణాలు మొదలయ్యాయని భావించిన ఎన్నారైలకు ఒమిక్రాన్ గుదిబండలా మారింది.అరబ్ దేశాలు, అమెరికా వంటి దేశాలలో ఒమిక్రాన్ కేసులు నమోదు అవడంతో ఆయా దేశాలకు భారీగా వలసలు వెళ్ళే మన భారత ఎన్నారైలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
కొందరు ఏడాది నిరీక్షణ తరువాత అమెరికా వెళ్లేందుకు అనుమతులు వచ్చిన క్రమంలో ఒమిక్రాన్ విరుచుకుపడటంతో ఎక్కడ మళ్ళీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే కరోనా మొదటి, రెండవ వేవ్ సమయంలో పలు దేశాలలో ఉండిపోయిన ఎన్నారైలు ఎంతో కాలం తరువాత ఆయా దేశాలు అనుమతులు ఇవ్వడంతో స్వదేశానికి రావాలని ఆరాటపడుతున్నారు.
ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో ఒక వేళ స్వదేశానికి వెళ్ళినా వైరస్ ప్రభావం ఎక్కువగా అయితే ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని, స్వదేశంలో చిక్కుకు పోతామని ఆందోళన చెందుతున్నారు.అదే గనుక జరిగితే ఉద్యోగాలు కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు పడతామోననే భయం ఎన్నారైలను వెంటాడుతోంది.
ఎన్నారైలు ఎంతో మంది స్వదేశంలో ఉన్న తమ వారిని చూసుకోవాలని, సొంత ఊళ్ళో కొన్ని రోజులు గడపాలని అనుకుంటారు.అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయి విమానాల రాకపోకల విషయంలో భారత్ వెనకడుగు వేసింది.
దాంతో ఒక వేళ భారత్ వస్తే ఎక్కడ ఇరుక్కుపోతామోనని భయపడుతున్నారు.పైగా స్వదేశానికి వస్తే క్వారంటైన్ లో ఉండాల్సిందే అక్కడ 14 రోజులు పూర్తి చేసుకుని, ఇంటికి వచ్చిన తరువాత 7 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి.
ఆ అన్నిటికంటే ముందుగా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ వచ్చే ముందు, వెళ్ళే ముందు చూపించాలి.ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఎలాగోలా భారత్ వచ్చిన తరువాత లాక్ డౌన్ విధిస్తే ఇక అంతే సంగతులు.
భారత్కు రావాలని ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమ నిర్ణయాన్ని విరమించుకుంటున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.