ఎన్ఆర్ఐలను పన్ను పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2020లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.విదేశాల్లో ఉండి, అక్కడ పన్ను చెల్లించనివారు భారతదేశంలో ట్యాక్స్ కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో విదేశాల్లో సంపాదించిన ఆదాయం తదితర వివరాల గురించి చెప్పాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ ప్రవాస భారతీయులను ప్రశ్నించడం ప్రారంభించింది.వాణిజ్యపరమైన లాభాలు, కన్సల్టెన్సీ ఫీజు, భారీ వేతనాలు, విదేశాలలో చూపించని నిధుల గురించి ఎన్నారైలు రుజువులు చూపించాల్సి ఉంటుంది.
లేదంటే భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆర్ధిక బిల్లు 2020 ప్రకారం, మరే ఇతర దేశంలో లేదా భూభాగంలో పన్ను చెల్లించని భారతీయుడు, భారతదేశంలో నివాసిగా పరిగణించబడతాడు.
అలాంటి వ్యక్తులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించడంతో పాటు విదేశీ ఆస్తులను ప్రభుత్వానికి తెలపాల్సి ఉంటుంది.అయితే ప్రవాస భారతీయులు ఆదాయాన్ని విదేశాలలో సంపాదించినట్లు రుజువుచేసుకునే ప్రక్రియ భారంగా మారింది.
ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో బోనఫైడ్ వర్కర్స్ అనే పదం ప్రస్తావించబడింది.దీని ప్రకారం విదేశాలలో సంపాదించిన ఆదాయాలపై పన్ను విధించబడదని, అదే సమయంలో దాచిన ఆదాయంపై ఎన్నారైలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు 182 రోజుల పాటు విదేశాల్లో ఉన్న వారిని ఎన్ఆర్ఐగా పేర్కొనేవారు.అయితే ఫైనాన్స్ బిల్లు 2020 ప్రకారం దీనిని 240 రోజులకు పెంచారు.ఓ ఏడాదిలో 120 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే అతను ప్రవాస భారతీయుడిగా పరిగణించబడడు.అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను పలువురు ఆర్ధిక వేత్తలు విమర్శించారు.
ఇకపై ఎన్ఆర్ఐలు పన్ను ఆదా చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు.దుబాయ్తో పాటు ఎన్నో దేశాల్లో నివసిస్తున్న భారతీయులు అక్కడ అతి తక్కువ ఆదాయపు పన్ను కానీ లేదంటే ఏమీ కట్టడం లేదని గుర్తు చేశారు.
కానీ ఇకపై విదేశాల్లో పన్ను కట్టని వారు భారత్లో కట్టాల్సి ఉంటుందన్నారు.
ఎన్నారైలకు పన్ను విషయంలో చేదు వార్త చెప్పిన మోడీ ప్రభుత్వం….భారత్లో పెట్టుబడుల విషయంలో మాత్రం వెసులుబాటు కల్పించింది.దేశీయ స్టాక్ మార్కెట్ లేదా ఇతర రూపాల్లో విదేశీ సంస్థాగత మదుపుదారులు దేశంలో సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చు.
అలాగే కొద్దిరోజుల క్రితం ఎయిరిండియాలో ఎన్ఆర్ఐలు 100 శాతం వాటాలు పొందవచ్చునని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.