ఒమెక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి.గత వేరియంట్ల అనుభవాలు దృష్టిలో పెట్టుకున్న దేశాలు వలస వాసుల ఎంట్రీ పై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.
కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తో పాటు, 14 రోజులు, లేదా 7 రోజుల క్వారంటైన్ విధిస్తున్నాయి పలు దేశాలు.ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
అయితే ప్రపంచ దేశాలలో ఉన్న భారత ఎన్నారైలు ఆయా దేశాలలో కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందోనన్న భయంతో స్వదేశానికి తరలి వస్తున్నారు.ఈ క్రమంలో భారత్ లోని పలు ఎయిర్ పోర్ట్ లు ఎన్నారైలతో కిక్కిరిసి పోతున్నాయి.
ఇప్పటికే తాజాగా వైరస్ ఒమెక్రాన్ 38 దేశాలకు పాకడంతో అందులో భారత్ కుడా ఉండటంతో ప్రభుత్వం దేశంలోకి వచ్చే వారి విషయంలో అలెర్ట్ అవుతోంది.ఈ క్రమంలోనే RTPCR ను భారత ఎన్నారైలతో పాటుగా, ఇతర దేశాల నుంచీ వచ్చే విదేశీయులకు కూడా తప్పనిసరి చేసింది.
దాంతో ఎయిర్ పోర్ట్ లకు వస్తున్నా ఎన్నారైలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు.ఈ పరీక్షలలో నెగిటివ్ రిపోర్ట్ వస్తే వారిని బయటకు పంపుతున్నారు.
అలా బయటకి వెళ్ళిన వారు తప్పకుండా సెల్ఫ్ క్వారంటైన్ లో ఓ వారం పాటు ఉండాలని సూచిస్తున్నారు.ఇదిలాఉంటేRTPCR టెస్ట్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, సాంపిల్ ఇచ్చిన తరువాత సుమారు 4-5 గంటలు ఫలితాలు వెల్లడించడానికి సమయం పడుతోందని ఎన్నారైలు గగ్గోలు పెడుతున్నారు.
ఈ టెస్ట్ లను తప్పనిసరి చేయడంతో ఎక్కువగా రాకపోకలు ఉండే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బ్లాకులు అన్నీ ఎన్నారైలతో నిండిపోయాయి.లెక్కకి మించి ఎన్నారైలు మూకుమ్మడిగా ఉన్న ఓ ఫోటో ను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయంకా ట్వీట్ చేశారు.దాంతో అది కాస్తా వైరల్ అవ్వడంతో ప్రయాణాలు చేయాలంటేనే భయం వేస్తోందని, కనీస నిబంధనలు అక్కడ పాటించడం లేదంటూ ఎన్నారైలు కామెంట్స్ చేస్తున్నారు.