ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా.ప్రతి చిన్నపనికి ప్రభుత్వంపై ఆధారపడరాదని చెబుతున్నారు పలువురు ప్రవాస భారతీయులు .
తాము పుట్టిన గడ్డపై సమస్యలు ఎదుర్కొంటున్న తోటి వారి కోసం ఎంతో కొంత సాయం చేస్తున్నారు.ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో రోడ్డు ప్రమాదాలు ఒకటి.
ప్రతినిత్యం దేశవ్యాప్తంగా కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో మరణిస్తున్నారు.వీటిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది.
ఈ క్రమంలో పంజాబ్కు చెందిన ఎన్ఆర్ఐలు రాయ్కోట్, జాగ్రోన్ సమీపంలోని గ్రామాల్లోని రోడ్లపై మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు.ముఖ్యంగా రాత్రివేళల్లో పొడవైన మూల మలుపులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసిన రిఫ్లెక్టర్స్ వల్ల ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని గ్రామస్తులు చెబుతున్నారు.ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవడం చూసి చలించిపోయిన ఫిలిప్పీన్స్లో స్థిరపడిన ఎన్ఆర్ఐ జస్ప్రీత్ సింగ్, రాయికోట్-జాగ్రోన్ రహదారిపై బింజాల్ గ్రామంలో చీకటిగా ఉండే మూల మలుపుల వద్ద రూ.45,000 వ్యయంతో రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేశారు.తన తండ్రి కోరిక మేరకు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు.
జస్ప్రీత్ను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు.ఐతియానా, రాజోనా తదితర గ్రామాలకు చెందిన ఎన్నారైలు రహదారులపై రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేశారని స్థానిక సర్పంచ్ ఒకరు తెలిపారు.లూధియానా, బర్నాల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న చక భాయ్ కా గ్రామంలో కెనడాలో స్థిరపడిన గుర్ప్రీత్ సింగ్ పది చోట్ల రోడ్ మిర్రర్లను ఏర్పాటు చేశారు.
ప్రవాస భారతీయులు తమ కోసం ఏర్పాటు చేసిన ఈ మౌలిక సదుపాయాలను సురక్షితంగా ఉంచుకునేందుకు గాను ఇద్దరు వ్యక్తులను సైతం పంచాయతీ నియమించింది.పుట్టిన గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గాను ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషిని అంతర్జాతీయ రహదారి భద్రతా నిపుణుడు కమల్జిత్ సోయితో పాటు పలువురు సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు.