వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు దేశానికి సంపదను కూడబెడుతున్నారు.ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును తమ కుటుంబాల కోసం పంపడమే కాకుండా దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందజేస్తున్నారు.
కరోనాతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి.అయినప్పటికీ భారత ఖజానాలో మాత్రం విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి.
దేశ విదేశీ మారక నిల్వలు 582 మిలియన్ డాలర్లు పెరిగి సెప్టెంబర్ 4తో ముగిసిన వారానికి జీవితకాల గరిష్టం 542.013 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.మొత్తం నిల్వల్లో ప్రధానమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 269 మిలియన్ డాలర్లు పెరిగి 498.362 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.అంతర్జాతీయ ద్రవ్య నిధితో ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 2 మిలియన్ డాలర్లు పెరిగి 1,482 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఫలితంగా ఐఎంఎఫ్తో దేశ రిజర్వ్ స్థానం 9 మిలియన్ డాలర్లు తగ్గి 4,647 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇదే సమయంలో ప్రవాస భారతీయులు ఈ ఏడాది ఏప్రిల్, జూలై మధ్య కాలంలో భారతదేశానికి 4.6 బిలియన్ డాలర్ల మొత్తాన్ని తరలించారు.గత ఏడాది ఇదే కాలంలో ఎన్ఆర్ఐలు 3.5 బిలియన్ డాలర్లను విదేశీ మారక నిల్వలుగా అందజేశారు.తాజా మొత్తం కారణంగా దేశంలో ఎన్ఆర్ఐల డిపాజిట్లు జూలై 2020 నాటికి 136.36 బిలియన్ డాలర్లను తాకింది.ఇది మార్చి 2020లో 130.58 బిలియన్ డాలర్లు, 2019లో 132.12 బిలియన్ డాలర్లు, 2018లో 124.44 బిలియన్ డాలర్లు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ఎన్ఆర్ఐలు అధికంగా ఉన్న గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ జోన్ నుంచే ఎక్కువగా విదేశీ ద్రవ్యం వస్తోందని ఆర్బీఐ తెలిపింది.ఏప్రిల్లో లాక్డౌన్ విధించిన తర్వాత గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోతలు సైతం పెరిగాయి.భారతదేశానికి వచ్చిన విదేశీ ద్రవ్యంలో 96.08 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఎన్ఆర్(ఈ) ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్)కు, 22.62 బిలియన్ డాలర్లను ఎఫ్సీఎన్ఆర్ (బీ) ( ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్)కు జూలై నాటికి డిపాజిట్ల రూపంలో అందాయి.మరోవైపు ఏప్రిల్- జూలై మధ్య కాలంలో ఎన్ఆర్ఐలు ఎఫ్సీఎన్ఆర్ (బీ) ఖాతా నుంచి 1.62 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు.అదే సమయంలో 5.55 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఎన్ఆర్ఈఆర్ఐ ఖాతాల్లో జమ చేశారు.
అమెరికా, యూరప్లతో పోలిస్తే భారతదేశంలో వున్న మూడు ఎన్ఆర్ఐ డిపాజిట్ పథకాలు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
అక్కడి బ్యాంకులు కేవలం 1 శాతం మాత్రమే వడ్డీని ఇస్తుండగా.మనదేశంలో ఎన్ఆర్ఈ ఖాతాలకు ఎస్బీఐ ఒకటి నుంచి రెండేళ్ల కాలానికి 4.90 శాతం ఆఫర్ చేస్తోంది.అదే 3-5 ఏళ్ల మధ్య ఉన్న డిపాజిట్లపై 5.30 శాతం వడ్డీని అందిస్తోంది.వడ్డీ రేట్ల మధ్య వున్న వ్యత్యాసాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను ఎన్ఆర్ఐలు గల్ఫ్ దేశాలలో రునాలు తీసుకుని భారత్లో డిపాజిట్ చేసి రాబడులు అందుకుంటున్నారు.
అయితే ఎన్ఆర్ఐలు రూపాయి విలువ తగ్గింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు.