వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు.స్వదేశానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తున్నారు.
వీరి వల్ల పెద్ద సంఖ్యలో విదేశీ మారక ద్రవ్యం భారతదేశ ఖజానాకు జమ అవుతోంది.దీనికి తోడు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రభుత్వాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
స్వదేశంలో పెట్టుబడులు పెట్టి.ఎంతో మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.
ఇక కోవిడ్ సమయంలో ఎన్ఆర్ఐలు చేసిన సాయాన్ని ఈ దేశం మరిచిపోదు.ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, మందులు, వైద్య పరికరాలతో పాటు లక్షల డాలర్ల విరాళాలను ఎన్ఆర్ఐలు ఇండియాకు అందించారు.
అసలు విషయంలోకి వెళితే… కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లుగా మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు మందగించిన సంగతి తెలిసిందే.భారతదేశం విషయానికి వస్తే చాలా రాష్ట్రాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతుంటే, కేరళ రాష్ట్రంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నారైలు, స్థానికుల డిపాజిట్లు పెద్ద మొత్తంలో బ్యాంకులకు పోటెత్తుతున్నాయి.ఆ రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఎన్నారైల డిపాజిట్లు 10 శాతం మేర పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇదే కాలంలో దేశీయ డిపాజిట్లు కూడా 12 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.గత వారం జరిగిన 2020-21 ఆర్థిక సంవత్సరం సమీక్ష కోసం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అందజేసిన డేటా ప్రకారం, కేరళ వ్యాప్తంగా మార్చి 31 నాటికి ఎన్ఆర్ఐ డిపాజిట్లు రూ.2,29,636 కోట్లకు చేరుకున్నాయి.2020లో ఇదే సమయానికి 2,08,698 కోట్లు డిపాజిట్లుగా అందాయి.
కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ కేరళలో ఎన్ఆర్ఐ డిపాజిట్లు పెరగడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు.ఎన్ఆర్ఐలు విదేశాల్లో వున్న తమ ఖాతాలలోని డబ్బును భారత్లోని తమ స్వగ్రామంలోని బ్యాంకుకు బదిలీ చేసి ఉండవచ్చు.
రియల్ ఎస్టేట్ కూడా పడిపోవడంతో ఎన్ఆర్ఐలు డబ్బును విత్ డ్రా చేయకుండా వుండటానికి దోహాదం చేసింది.అంతేకాకుండా, వివిధ పథకాల కింద రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వాల నుండి నేరుగా నగదు బదిలీ జరగగడం కూడా దేశీయ డిపాజిట్ల పెరుగుదలకు కారణం కావొచ్చు.