వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం కన్నవారిని, ఆత్మీయులను, స్నేహితులను అందరినీ వదిలిపెట్టి విదేశాలకు వెళ్తున్నారు భారతీయులు.వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా వుండాలని మనసులో వున్నప్పటికీ.ఉద్యోగాల రీత్యా దూరంగా వుండక తప్పడం లేదు.వారి బాగోగులు చూసుకోవడానికి ఎవరో ఒకరిపై ఆధారపడుతున్నారు.చేతిలో కోట్లాది రూపాయలు వున్నప్పటికీ. కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు, ఫోన్ బిల్లులను విదేశాల నుంచి చెల్లించలేని నిస్సహాయతతో ఎన్ఆర్ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుభవార్త చెప్పింది.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పేరుతో కొత్త విధానం తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు.
ఇప్పటి వరకు మనదేశంలో వున్న వారికే ఈ విధానాన్ని ఉపయోగించే వీలుండేది.అయితే ఇక నుంచి ఇండియాకు వెలుపల వున్న భారతీయులు కూడా వినియోగించేలా మార్పులు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
దీని వల్ల విదేశాల్లో తామున్న ప్రాంతం నుంచే భారత్లో విద్యుత్, టెలికాం, డీటీహెచ్, నీరు, గ్యాస్, స్థానిక కార్పోరేషన్లు, పురపాలక సంస్థలకు చెందిన బిల్లులు, చదువుకు సంబంధించిన ఫీజులు చెల్లించవచ్చు.దీని వల్ల వృద్ధాప్యంలో వున్న తల్లిదండ్రులకు ఆసరాగా వుండేందుకు ఎన్ఆర్ఐలకు వీలు కలుగుతుంది.
ప్రస్తుతం భారత్ బిల్పేమెంట్ సిస్టమ్లో నెలకు 8 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.మనదేశంలో 20 వేల మంది ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు.
ఇకపోతే.మరోసారి రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.జూన్లో 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచిన ఆర్బీఐ… తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది.దీంతో 4.90 శాతంగా వున్న రెపో రేటు ప్రస్తుతం 5.40 శాతానికి చేరింది.గత రెండు రోజులుగా జరుగుతున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.ఆర్బీఐ నిర్ణయం కారణంగా బ్యాంక్ కస్టమర్స్కి రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.