సంస్కృతికి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. అలాంటి దేశం నుంచీ విదేశాలకు వెళ్ళిన భారత ఎన్నారైలు దేశం కాని దేశంలో కూడా మన భారతీయత ఉట్టిపడేలా, భారతీయులు అందరూ గర్వ పడేలా నడుచుకోవడం, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ, మన సాంప్రదాయాలను కొనసాగించడం ఎంతో సంతోషించదగ్గ విషయం.
ముఖ్యంగా అమెరికా వంటి దేశంలో అత్యధికంగా స్థిరపడిన భారతీయులు అక్కడి పలు ప్రాంతాలలో హిందూ దేవాలయాలు నిర్మిస్తూ నిత్య పూజలు, హోమాలు, యాగాలు , భారతీయతకు అద్దంపట్టేలా పండుగలు జరుపుకుంటున్నారు.భారతీయులలో అత్యధికంగా తెలుగు వారు ఈ విషయంలో ఎప్పడూ ముందుంటారనే చెప్పాలి.
దక్షిణాదిన ఎంతో మంది శీతాకాల సమయంలో చేపట్టే అయ్యప్ప దీక్షలను అమెరికాలోని తెలుగు వారు క్రమం తప్పకుండా ప్రతీ ఏటా ధరిస్తారు.ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువగా తెలుగు వారు అయ్యప్ప దీక్షలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇందుకోసం అమెరికాలోని మేరీల్యాండ్ లో నిర్మించిన శివ, విష్ణు దేవాలయాలు అయ్యప్పల కోసం ముస్తాబు చేస్తారు.వారికి అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపడుతారు.
దీక్షలు తీసుకోవడం మొదలు విరమించే అన్ని కార్యక్రమాలు ఈ దేవాలయంలో చేపడుతారు.అంతేకాదు అడవి మార్గం గుండా ఈ గుడికి వెళ్ళేలా దారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అయితే
ప్రతీ ఏటా కంటే కూడా ఈ ఏడాది అయ్యప్ప మాలలు ధరించే వారి సంఖ్య పెరగడంతో అమెరికాలోని హిందూ దేవాలయాలలో అయ్యప్ప స్వామీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ ఏడాది అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో సుమారు 5 వేల మంది అయ్యప్ప దీక్షలు తీసుకున్నారని తెలుస్తోంది.
కాగా అయ్యప్ప దీక్షల విరమణకై కొందరు శబరిమల వెళ్ళగా కొందరు స్థానికంగా ఉండే హిందూ దేవాలయాలలో దీక్షలు విరమిస్తుంటారు.ఈ దీక్షా సమయంలో ప్రతీ ఇంట్లో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం, భోజనాలు చేయడంతో తెలుగు వారి ఇళ్ళన్నీ శోభాయమానంగా, కోలాహలంగా మారుతున్నాయి.