కేరళలోని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజీల్లోని ఎన్ఆర్ఐ కోటా సీట్ల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.ఎన్ఆర్ఐ సీట్లను ఖాళీగా ఉంచాలని లేదంటే ఇతర కోటాలకు బదిలీ చేయాలని ఆదేశించింది.
రాష్ట్రం నుంచి అడ్మిషన్ పొందే వారు లేకపోవడం వల్ల 15 శాతం ఎన్ఆర్ఐ కోటాలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని కేరళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిని పరిగణనలోనికి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం విచారించింది
కేరళలోని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఎన్ఆర్ఐ కోటా సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయించవచ్చని తెలిపింది.
అయితే ఎన్ఆర్ఐ విద్యార్ధులకు సంబంధించిన నిబంధనలను కఠినంగా పాటించాలని సుప్రీం స్పష్టం చేసింది.నిబంధనల ప్రకారం సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐలకు కేటాయించబడతాయి.
మరోవైపు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి కేరళ ప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీ నిబంధనను సడలించిందని విద్యార్ధుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీనిపై స్పందించిన ధర్మాసనం బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన పిటిషన్లు తమ పరిశీలనలో ఉన్నాయని తెలిపింది.
తమ తుది తీర్పు మేనేజ్మెంట్లకు అనుకూలంగా ఉంటే బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.ఇదే సమయంలో ప్రాస్పెక్టస్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్ 3న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ విచారణకు మేనేజ్మెంట్ అసోసియేషన్ హాజరుకానుంది.