కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదుపుకు లోనయ్యాయి.ఈ మహమ్మారి ముప్పు తప్పినా ఇప్పట్లో మనిషి సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా ఏళ్లే పడుతుందని నిపుణుల అంచనా.
అయితే కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా కోలుకుంటోంది.ప్రభుత్వ విధానాలతో పాటు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాలు ఇందుకు దోహాదం చేస్తున్నాయి.
అయితే భారతదేశంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు రియల్ ఎస్టేట్కి ఊపుతెస్తున్నాయి.సాధారణంగా యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు.
భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు.ప్రవాసులు పంపే నిధుల్లో 42% కేవలం ఈ దేశాల నుంచే వస్తున్నాయి కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగ, వ్యాపార అవకాశాలు దెబ్బతిన్నాయి.
వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి ఇంకా పోలేదు.ఇతర దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే భారతీయులు కరోనా కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
దీంతో అనుకోని విపత్తులు ఎదురైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న చాలామందిని ఆలోచింపజేసింది.ఎప్పటికైనా స్వదేశంలో ఇల్లు లేదా ఆస్తులు ఉంటే మేలనే నిర్ణయానికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు వచ్చారు.
ఈ ఉద్దేశంతోనే ఎన్ఆర్ఐలు సొంత గడ్డపై భూమి, ఆస్తులు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.
దీంతో కొద్దినెలల నుంచి ఎన్ఆర్ఐలు భారత్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు పెంచారు.
ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు లేదా భారత సంతతి ప్రజలు భారత్లో ఎన్ని స్థిరాస్తులైనా కలిగి వుండొచ్చు.వీటిపై వచ్చే అద్దె తదితర ఆదాయాలను ఎలాంటి అనుమతులు లేకుండా తాము నివసిస్తున్న దేశానికి బదిలీ చేసుకోవచ్చు.
ఈ ఆస్తుల కొనుగోలు సమయంలో ఎలాంటి ఆదాయపు పన్ను లేకపోవడం కూడా కలిసి వస్తోంది.
రెండు కారణాల రీత్యా ఎన్ఆర్ఐలు దేశీయ రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఒకటి.స్థిరాస్తుల్లో పెట్టుబడి వల్ల మూలధనం భద్రంగా ఉంటుంది.
ఆపై ఆస్తి విలువలో పెరుగుదలా ఉంటుంది.ధరలు ఏటా కనీసం 15 శాతం పెరుగుతున్న విషయం తెలిసిందే.రెండు… ఏనాడైనా తిరిగి స్వదేశం వచ్చి స్థిరపడాలనుకుంటే స్థిరాస్తుల భరోసా ఉంటుంది.ఉండటానికి ఇల్లు ఉంది.
అవసరమైతే కొన్ని స్థిరాస్తులను నగదుగా మార్చుకొని వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టొచ్చు.గతంతో పోలిస్తే ఇప్పుడు స్థిరాస్తుల భద్రతకు చట్టపరంగా కూడా మెరుగైన పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ పరిసర ప్రాంతాల్లోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు.35-45 ఏళ్ల మధ్య వయస్కులైన ఎన్ఆర్ఐలు తమ తల్లిదండ్రుల కోసం, 55 ఏళ్ల పైబడిన వారు పదవీవిరమణ తర్వాత శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు విల్లాలు, లగ్జరీ హౌస్లు కొనుగోలు చేస్తున్నారు.