వివాహిత ఆత్మహత్యకు కారణమయ్యారనే అభియోగంపై ఎన్ఆర్ఐ భర్త సహా అతని నలుగురు సోదరీమణులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే… పంజాబ్లోని పాంధర్ గ్రామానికి చెందిన అమర్జిత్ సింగ్ కుమార్తె జస్బీర్ కౌర్ వివాహం పదేళ్ల క్రితం ఫిలిప్పిన్స్లోని మనీలాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు సరబ్జిత్ సింగ్తో జరిగింది.పెళ్లయిన నాటి నుంచి సరబ్జిత్ తన భార్యను వేధింపులకు గురిచేసేవాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జస్బీర్ సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు భారత్కు వచ్చింది.అయితే ఆమె వెంట సరబ్జిత్ రాకపోగా, పిల్లలను సైతం తల్లి వెంట పంపలేదు.అంతేకాకుండా తన మాట కాదని ఇండియాకు వెళితే.
తిరిగి ఫిలిప్పిన్స్ వచ్చేందుకు తాను స్పాన్సర్ చేయనని భార్యకు తెగేసి చెప్పాడు.తన ఇంట్లో వివాహ వేడుకలు ముగిసిన తర్వాత జస్బీర్ కౌర్ స్థానికంగా ఉన్న తన అత్తగారింటికి వెళ్లేది.
నాటి నుంచి సరబ్జిత్ సింగ్ తన భార్యతో మాట్లాడకపోగా, పిల్లలను సైతం తల్లితో మాట్లాడేందుకు ఒప్పుకునేవాడు కాదు.ఇదే సమయంలో తన భర్త, ఆడపడుచులు తనను వేధిస్తున్నారంటూ జస్బీర్ కౌర్ సెప్టెంబర్ 20న తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు మొర పెట్టుకుంది.
దీనిపై తీవ్ర మనోవేదనకు గురైన జస్బీర్ కౌర్ సెప్టెంబర్ 22న విషం తాగింది.వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను లోహియన్ ఖాస్ క్లినిక్కు , అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం డీఎంసీ లూధియానాకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న ఆమె తుదిశ్వాస విడిచినట్లు జస్బీర్ తండ్రి అమర్జిత్ సింగ్ తెలిపారు.దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సరబ్జిత్ అతని సోదరీమణులు కమల్జీత్, బల్జీత్, జిందార్, రన్నలపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు.