విదేశాల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నా.రోజుకో మోసం వెలుగుచూస్తున్నా భారత్లో, ముఖ్యంగా తెలుగునాట ఎన్ఆర్ఐ అల్లుల్లపై వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
దీనిని క్యాష్ చేసుకుంటున్న కొందరు సైబర్ కేటుగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు. మ్యాట్రిమోని సైట్లలో ఫేక్ ప్రోఫైల్ పెట్టడమో లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారానో వల వేస్తున్నారు.
తనను తాను ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని, మాయ మాటలతో అందినకాడికి దోచుకుంటున్నారు.అంతో ఇంతో చదువుకున్న వారితో పాటు డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ కూడా కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.కొద్దిరోజుల క్రితం బెంగళూరులో ఎన్ఆర్ఐని అని చెప్పిన ఓ మోసగాడు… వారిని బాగా నమ్మించి సుమారు రూ.70 లక్షలు దోచేసిన వార్త కలకలం రేపింది.ఆ తర్వాత గుర్గావ్లో ఓ వ్యక్తి మ్యాట్రిమోని సైట్లో ఎన్ఆర్ఐనని చెప్పి ఓ మహిళకు రూ.18 లక్షలు టోకరా పెట్టాడు.ఇలా ప్రతినిత్యం దేశంలోని ఏదో ఒక మూల ఈ తరహా మోసం జరుగుతూనే వుంది.
తాజాగా హైదరాబాద్కు చెందిన మహిళ కేటుగాళ్ల వలలో చిక్కింది.
వివరాల్లోకి వెళితే.సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ ప్రైవేటు ఉద్యోగి.
అయితే ఆమె భర్త మరణించడంతో.మళ్లీ పెళ్లిచేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఒప్పుకుంది.
దీనిలో భాగంగా ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఆమె తన వివరాలు నమోదు చేశారు.ఈ క్రమంలో ఓ రోజున ఓ వ్యక్తి.
తన పేరు క్లిఫర్డ్ అని, పంజాబ్లో తన మూలాలున్నాయని, ఐరోపాలో స్థిరపడ్డామని చెప్పాడు.ప్రస్తుతం స్కాట్లాండ్లో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు తల్లి కోరిక మేరకు దక్షిణాదివారిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.
దీంతో ఆ మహిళ అతని ప్రతిపాదనకు అంగీకరించింది.నాటి నుంచి ఇద్దరూ ప్రతిరోజూ ఛాటింగ్ చేసుకోవడంతో పాటు ఫోన్ నెంబర్లు సైతం ఇచ్చి పుచ్చుకున్నారు.ఈ క్రమంలో వారం క్రితం ఫోన్ చేసిన క్లిఫర్డ్, పెళ్లికి ముందు గోల్డ్, డైమండ్ నెక్లెస్ బహుమతిగా పంపుతున్నానని నమ్మించాడు.ఇందుకు సంబంధించి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి పార్సిల్ పంపానన్నాడు.
అయితే కస్టమ్స్ అధికారుల వద్ద అది నిలిచిపోయిందని.దానిని విడిపించుకోవాలని సూచించాడు.అతను చెప్పిన ఖాతాల్లోకి దశలవారీగా రూ.9 లక్షలు చెల్లించారు బాధితురాలు.ఎంతకీ పార్సిల్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.