చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ మహమ్మారి వైద్య రంగంపై పెను సవాల్ విసురుతోంది.వైద్యులు, ఇతర సిబ్బంది రాత్రింబవళ్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు.
అయినప్పటికీ పెరుగుతున్న కేసులకు సరిపడా వైద్యుల కొరత ఉండటంతో ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది.రిటైర్మెంట్ తీసుకున్న వైద్యులు, ఇతర వాలంటీర్లు ముందుకు వస్తున్నా సరిపోవడం లేదు.
ఈ క్రమంలో విదేశాల్లో విద్యనభ్యసించిన మనదేశానికి చెందిన వారు సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారు.అయితే అందుకు లైసెన్స్ ఉండాలి.
ఇది కావాలంటే తప్పనిసరి పరీక్ష రాయాల్సి ఉండటం వీరికి అడ్డంకిగా మారింది.దీంతో తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కరోనాపై పోరాటంలో భాగంగా 20,000 మంది ఎంబీబీఎస్ వైద్యులు, 1,000 మంది నిపుణులు సిద్ధంగా ఉన్నారని ఆల్ ఇండియా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఏఐఎఫ్ఎంజీఏ) మార్చి 26న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్కు లేఖ రాసింది.ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ అసోసియేషన్కు ఎలాంటి స్పందనా రాలేదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన భారతీయ పౌరుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ఏదైనా రాష్ట్ర వైద్య మండలిలో తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ కావాలంటే నేషలన్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఎంసీఐ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి.ప్రస్తుత కరోనా సంక్షోభం సమయంలో యూకే, ఇటలీలలో అక్కడి ప్రభుత్వం ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్ధులను ఉపయోగించుకుంది అసోసియేషన్ తన లేఖలో ప్రస్తావించింది.రాబోయే రోజుల్లో దేశానికి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు, వివిధ రకాల వైద్య, శస్త్రచికిత్స నిపుణులు అవసరమవుతారని తెలిపింది.
భారతదేశానికి చెందిన వేలాది మంది విదేశాల్లో వైద్య విద్య పట్టా అందుకుని దేశంలో రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నారని అసోసియేషన్ వెల్లడించింది.
అందువల్ల ప్రస్తుతం భారతదేశం క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నందున స్క్రీనింగ్ టెస్ట్ నిబంధనను తొలగించాలని తాము ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్కు లేఖ రాసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు నాజీరుల్ అమీన్ తెలిపారు.