లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఉన్మాదిగా మారాడు.అక్రమ మార్గంలోనైనా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో మ్యాట్రిమోని సైట్ ద్వారా డజన్లకొద్దీ యువతులను మోసం చేసి డబ్బు కాజేశాడు.
అయితే ఓ యువతి ఫిర్యాదుతో అతని గుట్టు బయటపడింది.మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన వైభవ్ సతీష్ కాపాలే అనే వ్యక్తి లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో ఆర్ధిక అవసరాల కోసం మోసాలకు దిగాడు.
ఓ మ్యాట్రిమోని సైట్లో తనను లండన్కు చెందిన ఎన్ఆర్ఐ వైద్యుడిగా పేర్కొంటూ ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు.
అనంతరం పెళ్లి కాని అమ్మాయిలకు రిక్వెస్ట్లు పంపి వారిని ముగ్గులోకి లాగేవాడు.కేవలం మరాఠీ మహిళలు, యువతుల్నే టార్గెట్ చేసిన వైభవ్.తన విద్యార్హతకు రుజువుగా ఓ ఫేక్ సర్టిఫికేట్ను సైతం సృష్టించాడు.అలాగే తనకు నెలకి 1.5 మిలియన్ డాలర్లు వేతనమని అమ్మాయిలను నమ్మించేవాడు.దీనితో పాటు వారితో చాట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడేవాడు.
తన బుట్టలో పడిందనుకున్న అమ్మాయితో పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదన తీసుకొచ్చేవాడు.వారు ఒప్పుకున్న తర్వాత ఆర్ధిక సమస్యలున్నాయంటూ అందినకాడికి దండుకునేవాడు.ఈ క్రమంలో జబల్పూర్కి చెందిన ఓ యువతిని కూడా ట్రాప్ చేసి రెండున్నర లక్షలు దోచుకున్నాడు.అయితే డబ్బు చేతికి అందిన తర్వాత తనకు ఫోన్ చేయడం మానేయడంతో అనుమానం వచ్చిన యువతి మోసపోయినట్లు గ్రహించి మూడు రోజుల క్రితం జబల్పూర్ సైబర్ సెల్కు ఫిర్యాదు చేసింది.
దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు… నిందితుడు సతీశ్ను పట్టుకునేందుకు గాను ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు.కేవలం 72 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.
నాసిక్లో వైభవ్ సతీశ్ను అరెస్ట్ చేసి జబల్పూర్ తరలించారు.మరోవైపు అతనిపై ఇప్పటి వరకు 5 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ తెలిపారు.
తాము వెంటనే స్పందించి వైభవ్ను అదుపులోకి తీసుకోవడం వల్ల మరికొంతమంది మహిళలు అతని బారినపడకుండా కాపాడగలిగామని చెప్పారు.