కరోనా కారణంగా దేశంలో అన్ని రకాల పనులు నిలిచిపోయాయి.ముఖ్యంగా పలుగు, పారలు, గొడ్డళ్లు, గంపలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోటెత్తే కూలీలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు.
రెక్కాడితే కానీ డొక్కాడని వీరి పరిస్ధితి ఇప్పుడు అగమ్యగోచరం.వీరి కుటుంబాలను ఆదుకోవడానికి కొందరు సాయం చేస్తున్నప్పటికీ అవి అందరికీ అందడం లేదు.
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న వలస కూలీలు పెద్ద సంఖ్యలో తమ సొంత రాష్ట్రాలకు వలస వెళ్లడం పలువురిని కలచివేసింది.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో ఉపాధి కోసం వచ్చిన పలు కుటుంబాలను తెలుగు ఎన్ఆర్ఐ దివ్య రావెళ్ల ఆదుకున్నారు.ఆదివారం న్యూఢిల్లీ సుల్తాన్పూర్ ప్రాంతంలో డాక్టర్ ఆనంద్ సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి తన ఎన్జీవో సంస్థ బంజారా మహిళ ఎన్జీవో ద్వారా పేదలకు ఆహారాన్ని పంపణీ చేశారు.100 పేద తెలుగు కుటుంబాలకు గోధుమలు, నూనె, పప్పు, ఇతర ఆహార పదార్ధాలను దివ్య అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ తన మిత్రురాలు, స్పాన్సర్ దివ్య రావెళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కరోనా వైరస్ను ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు.అలాగే ఈ సంక్షోభ సమయంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆనంద్ అభ్యర్ధించారు.