మాతృదేశంలో బంధుమిత్రుల మధ్య సరదాగా గడుపుదామని వచ్చిన ఎన్ఆర్ఐ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.పంజాబ్లోని ఫగ్వారాకు చెందిన కిర్పాల్ సింగ్ మిన్హాస్ (67), దేవిందర్ కౌర్ (65) దంపతులు కెనడాలో స్థిరపడ్డారు.
ఈ క్రమంలో భారతదేశానికి వెళ్లి కొన్నాళ్లు గడుపుదామని భావించి గతేడాది నవంబర్లో ఫగ్వారాకు వచ్చారు.
కొన్ని నెలల తర్వాత తిరిగి కెనడాకు వెళ్లాల్సిన వీరి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది.
భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 విరుచుకుపడటంతో లాక్డౌన్ను విధించారు.అయితే కేంద్రం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వివిధ దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంతో పాటు మనదేశంలో చిక్కుకున్న విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది.
దీంతో కిర్పాల్ దంపతులు కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే నిన్న రాత్రి ఈ దంపతులు దారుణహత్యకు గురయ్యారు.
గుర్తు తెలియని దండుగులు ఈ వృద్ధుల గొంతు కోసి హతమార్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కిర్పాల్ ఇంట్లో అద్దెకు ఉండే ఓ వ్యక్తి ఈ హత్యలు జరిగిన తర్వాతి నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.