కూతురు సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎంతోమంది తల్లిదండ్రులు వారిని ఏరికోరి ఎన్ఆర్ఐలకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు.వివాహ సమయంలోనూ భారీగా కట్న, కానుకలు సమర్పిస్తున్నారు.
ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెట్టిన అమ్మాయిలు.అక్కడ భర్తల చేతిలో చిత్రహింసలకు గురవుతున్నారు.
తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఎవరిని కలిసే వీలు లేక మహిళలు తమలో తాము కుమిలిపోతున్నారు.
ఇలాంటి వారికి సహాయం చేసుందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఎన్నారై సెల్లో భర్తలు, వారి కుటుంబాలపై వచ్చిన 73 ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు 70 కేసులు నమోదయ్యాయి.
ఎన్నారైలు నిందితులుగా ఉన్న కేసులను విచారించేందుకు, పర్యవేక్షించేందుకు గాను నోడల్ ఏజెన్సీగా జూలై 2019న రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగంలో ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేశారు.అప్పటి నుంచి దీనికి 73 ఫిర్యాదులు అందాయి.
వీటిని పరిశీలించిన అధికారులు 70 కేసులు నమోదు చేశారు.
ఈ 70 కేసుల్లో 29 కేసులు దర్యాప్తులో, 41 కేసులు విచారణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.40 మంది నిందితులపై లుక్ ఔట్ నోటీసులు, 32 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడంతో పాటు ఆరుగురి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో ఎన్నారైలపై 574 కేసులు నమోదయ్యాయి.వీటిలో 41 మహిళా పోలీస్ స్టేషన్లలో 417 కేసులు, 577 మంది నేరస్థులపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.రాష్ట్రంలో ఎన్నారైలపై అత్యధిక కేసులు సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్లో (137) నమోదయ్యాయి.
ఆ తర్వాతి స్థానంలో 78 కేసులతో సరూర్నగర్ ఉంది.