దేశంలోని అన్ని రంగాలపై కరోనా పెను ప్రభావం చూపిస్తోంది.వైరస్ను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్తో ఎంతోమంది ఉపాధిని కోల్పోగా, ఇక పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల పరిస్దితి అంతే.
గ్రాండ్గా వివాహం చేసుకోవాలని భావించిన వారు చివరికి పది మందితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇదే సమయంలో ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకున్న యువతుల పరిస్ధితి దారుణంగా తయారైంది.
కరోనాకు ముందే వీరి వివాహాలు అయిపోయాయి.
అయితే ప్రవాస భారతీయులు భార్యను తమతో పాటు విదేశాలకు తీసుకెళ్లాలంటే వీసా, పాస్పోర్ట్ వంటి చట్టపరమైన అనుమతులు తప్పనిసరి.
కానీ లాక్డౌన్ కారణంగా పాస్పోర్ట్ కార్యాలయాలను ప్రభుత్వం మూసివేసింది.దీంతో భర్తలు భార్యలను వదిలిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు.గత రెండు నెలల నుంచి దేశంలో అమల్లో ఉన్న లాక్డౌన్ను కేంద్రం సడలిస్తూ రావడంతో దేశవ్యాప్తంగా అనేక వ్యాపార సంస్ధలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.అక్కడక్కడ పాస్పోర్ట్ కేంద్రాలను కూడా తెరవడంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారు పాస్పోర్ట్ కార్యాలయాలకు పోటెత్తారు.
అయితే అందరికంటే ఎక్కువగా నవ వధువులే అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఉదాహరణకు పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగరంలో ఉన్న పాస్పోర్ట్ కేంద్రంలో మొదటి రోజు 241 మంది కొత్త పాస్పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోగా… ఇందులో 50 మంది కొత్త పెళ్లికూతుళ్లే.ఎన్ఆర్ఐలను పరిణయమాడటంతో .విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న పాస్పోర్ట్ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో.పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు నవ వధువులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జలంధర్ నగరానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కరోనా నేపథ్యంలో అధికారులు రోటేషన్ పద్ధతిలో పరిమిత సిబ్బందితోనే విధులు నిర్వర్తిస్తున్నారు.