రాజకీయాల్లో ఎప్పుడూ తమ బలం కంటే ప్రత్యర్థి బలహీనతల మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది.పొరపాటున ఏదైనా విషయంలో వారు దొరికారో దాన్ని బట్టి ఓ ఆట ఆడేసుకుంటారు.
ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేవే.ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది.
జగన్ దూకుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు అయితే వస్తోంది.ఈ సమయంలో వైసీపీని ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి ఆయుధాలు దొరకడంలేదు.
సరిగ్గా ఈ సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రం స్పష్టంగా చెప్పెయ్యడంతో టీడీపీలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చి తీరుతామని గతం నుంచి వైసీపీ చెబుతూ వస్తోంది.
ఇప్పుడు కేంద్రం ప్రకటనతో అటు కేంద్రం మీద గట్టిగా విమర్శలు చేయలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక జగన్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.
అంతే కాకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం జగన్ను ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే అంశాన్ని ఇప్పుడు జగన్పై పోరాడేందుకు ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకోబోతున్నాయి.అధికారంలోకి వచ్చిన జగన్ కేంద్రంపై పోరాటం కంటే సఖ్యతనే మేలని భావిస్తున్నారు.
మరోవైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మొగ్గు చూపడటం లేదు.ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ఏపీకి హోదా ఇచ్చే ప్రతిపాదనలు ఏమీ లేవని సూటిగా చెప్పేసారు.
ఈ అంశం ఆధారంగానే రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయాలు నడిచే అవకాశం ఉంది.ప్రత్యేక హోదా తెస్తారనే నమ్మకంతోనే వైసీపీకి ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారని, కాబట్టి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు వైసీపీ ఏం చేస్తోందని ఇప్పటికే టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేశాయి.
ఇప్పటికే సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జగన్కు లేఖ రాశారు.పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఇక, తెలుగుదేశం పార్టీ కేంద్రంపై పోరాటానికి విరామం ప్రకటించినా ప్రత్యేక హోదా అంశంపై జగన్ను ఇరుకున పెట్టేందుకు సిద్ధం అవుతోంది.రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు, పోరాటాలు పెరిగే అవకాశం ఉంది.
జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఈ మేరకు ఆందోళనలు స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.అప్పుడు ఆందోళనలను నియంత్రించేందుకు ప్రయత్నించాల్సిందే.ఇదే చేస్తే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జగన్ అణిచేస్తున్నారని టీడీపీ రాద్ధాంతం చేసేందుకు కాచుకు కూర్చుంది.